మరికొన్ని గంటలలో 2022 సంవత్సరం ముగుస్తుంది. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది? జగన్ ప్రభుత్వం ఏం సాధించింది? అని ప్రశ్నించుకొంటే సమాధానాలు అందరికీ తెలుసు. అమరావతి, పోలవరం రెండూ ఎక్కడివక్కడే ఉన్నాయి. అంగుళం కూడా కదల్లేదు. రాష్ట్రంలో అభివృద్ధి జీరో! కొండలు కరిగిపోయాయి! ప్రభుత్వం చేస్తున్న అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి!
అలాగే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి, అర్దరాత్రి పోలీసులు ప్రహారీ గోడలు దూకి వారి ఇళ్ళలోకి ప్రవేశించి అరెస్ట్ చేయడమనే మరో కొత్త పద్దతిని ఈ ఏడాదిలోనే ప్రవేశపెట్టారు. అలాగే ప్రతిపక్ష నేతల ఇళ్ళలో వారు లేనప్పుడు ప్రవేశించి ఇంట్లో వారిని భయపెట్టడం, పనిమనుషులను ప్రశ్నించడం, నోటీసులు ఇవ్వడం వంటి సరికొత్త విధానాలను కూడా వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఈ సంవత్సరంలోనే ప్రవేశపెట్టింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఉండవల్లిలోని కోట్లు పెట్టి గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసింది కనుక ప్రతిపక్ష నేతల ఇళ్ళ ప్రహారీగోడలు, ఇప్పటం గ్రామంలో జనసేన సానుభూతిపరుల ఇళ్ళు కూల్చివేతలు పెద్ద విషయంగా భావించలేము.
ప్రతిపక్షాల సభలు, ర్యాలీలపై భౌతిక దాడులు చేయడం కూడా ఈ ఏడాదిలో వచ్చిన మరో ముఖ్యమైన మార్పు అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కుప్పంలో అన్నా క్యాంటీన్పై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తే, పోలీసులు టిడిపి కార్యకర్తలని అరెస్ట్ చేశారు. ఆ ట్రెండ్ నేటికీ అలాగే కొనసాగిస్తున్నారు.
మంత్రులు ప్రధాన బాధ్యత వారి శాఖలు చూసుకోవడం కాదు చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తుండటమే మెయిన్ డ్యూటీగా భావిస్తూ అందులో ఎంతో నిష్ణాతులైన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ వంటివారి స్థానంలో ఆర్కె.రోజా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటివారు ఛార్జ్ తీసుకొన్నదీ ఈ ఏడాదిలోనే!
ఇక వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే ఒక్క వీడియోతో ఆంధ్రప్రదేశ్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయేలా చేశారు. అలాగే సిఎం జగన్ తర్వాత రెండో స్థానంలో ఉంటున్న మరో ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యింది కూడా ఈ ఏడాదిలోనే.
వైసీపీ ప్రభుత్వం రూ.1,400 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ కొనిచ్చింది… ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు నెలనెలా రోడ్లపైకి వచ్చి జీతాల కోసం ఆందోళనలు చేయడం మొదలైంది కూడా ఈ సంవత్సరంలోనే.
హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు పడ్డాలో లెక్కకట్టడం అసంభవం. ఇక ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేస్తున్నందుకు ఉన్నతాధికారులు హైకోర్టులో లెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పుకొన్న సందర్భాలను మాత్రం లెక్కించి చెప్పవచ్చు.
ఇక ఈ సంవత్సరానికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ విశాఖని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. అయితే మూడు రాజధానులు… లేకుంటే విశాఖ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉన్న ఒక్క రాజధానికే దిక్కు లేదు ఇక మూడు రాజధానులు ఎప్పుడు?అనే ప్రశ్న వినబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఇలా వైసీపీ పాలన ఎంత దివ్యంగా సాగిందో చెప్పుకోవడానికి ఒక సంవత్సరకాలం కూడా సరిపోదు. కనుక 2023 మొత్తం తాపీగా చెప్పుకోవచ్చు. వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే గొప్పగా ఏమీ ఉండబోదు కనుక హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందేమో?



