నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 11 ఎమ్మెల్యేల అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్లో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకి పూల దండవేసి దణ్ణం పెట్టి ఆ ఫోటోని సోషల్ మీడియాలోకి పంపించారు. ఆ ఫోటోలో ఆయన వెనుక వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి ఏదో ఆలోచిస్తున్నట్లు కనబడతారు. అది యాదృచ్చికం కావచ్చు.
ఆ ఫోటోతో పాటు గురువు గురించి జగన్ నాలుగు ముక్కలు చెప్పారు. “విద్యా, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు” అని చెప్పారు.
జగన్కి పాఠాలు చెప్పిన ఆ గురువులు ఎవరో కానీ వారికి నిజంగానే చేతులెత్తి మొక్కాల్సిందే. జగన్ సందేశంలో పెట్టిన ఏ ఒక్క లక్షణం ఆయనలో కాగడా వేసి వెతికినా కనబడదు. ఉండి ఉంటే 5 ఏళ్ళ పాలనలో గురువులకి మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు వేసేవారే కారు. వారిచేత రోజూ మరుగుదొడ్లు ఫోటోలు తీయించేవారే కారు.
అన్నీ చేయించుకున్నా కనీసం నెలనెలా జీతాలు కూడా ఇవ్వకుండా గురువులని ఏడిపించారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన పేరుతో 5 ఏళ్ళ పాటు జగన్ మావయ్య చేసిన ఘన కార్యాలు అన్నీ ఇన్నీ కావు.
ఆయన ప్రతినిధిగా విద్యాశాఖ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఎంత వేధించి అవమానించారో అందరికీ తెలుసు.
ఉపాధ్యాయుల పట్ల నమ్మకం, గౌరవం లేకనే జగన్ వారిని ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని ప్రయత్నించారు. ఇవన్నీ కేవలం పాఠశాలలు-ఉపాధ్యాయులకు సంబందించిన ఘనకార్యాలు మాత్రమే.
జగన్ 5 ఏళ్ళ పాలనలో వివేకం, దీక్ష, దక్షతలు ఎంత గొప్పగా ప్రదర్శించారో అందరికీ తెలుసు. రాష్ట్రానికి రాజధాని అవసరమని గ్రహించకపోవడం ఏ వివేకమో తెలీదు. మూడు రాజధానులు కాకపోయినా కనీసం ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఆ పేరుతో విశాఖలో ఋషికొండపై ప్యాలస్ కట్టుకున్నారు. టిడిపి హయాంలో కట్టించిన కృష్ణానదికి కరకట్టని తాను కట్టించానని చెప్పుకోవడమే దీక్ష దక్షతలకు నిదర్శనమనుకోవాలేమో? ఐదేళ్ళలో చేయకూడనివన్నీ చేసి మళ్ళీ ఇలా పాఠాలు చెప్పడం జగన్కు మాత్రమే చెల్లు!




