151 సీట్లు ఉన్న అధికార పార్టీ తదుపరి ఎన్నికలలో పట్టుమని 12 సీట్లు కూడా సాధించలేకపోతే, ఆ పాలనను ఏమంటారు? అధ్వానమైన పరిపాలనకు నిదర్శనమా? ‘మాకొద్దు ఈ ప్రభుత్వం బాబోయ్’ అని చెప్పడానికి కొలమానం అనుకోవాలా?
తన పరిపాలనకు ప్రజలు ఈ రకమైన ‘శుభం కార్డు’తో తీర్పు ఇచ్చినా, తన తప్పును ఏ మాత్రం జగన్ తెలుసుకోలేకపోతున్నారని, ఓటమి అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రెస్ వీడియోలో స్పష్టమవుతోంది.
ప్రజలకు ఇంత మంచి చేసానని, అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి పధకాలు ఇచ్చానని బీదార్పులు అరుస్తున్నారంటే, ఇంకా పధకాల మాటునే జగన్ ఆలోచనలు ఆగిపోయాయి కాబట్టే, ఒక నాయకుడిగా జగన్ అనర్హుడని ప్రజలు కితాబిచ్చారు.
ఈ ప్రెస్ మీట్ లో కూడా క్రింద చూస్తూ మాట్లాడిన జగన్ ముఖకవళికల్లో కన్నీరు ఒక్కటే తక్కువ. అయితే ఇదే జగన్ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ నవ్వులు పూయించిన వైనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
తుఫాన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు గానీ, ప్రముఖుల తుది శ్వాస విడిచిన సమయాలలో గానీ, వంగా గీత ఏడుస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో గానీ… ఇలా చెప్పుకుంటూ పోతే, పక్కనున్న వారు కన్నీటి పర్యంతం అవుతుంటే, జగన్ చిరుదరహాసాలు చిందించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి.
ఇప్పుడు అదే జగన్ మాటలు రాక వెలవెలబోతుంటే, తాము ఇచ్చిన తీర్పుతో హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం ప్రజల వంతవుతోంది. అంతేకదా… కాలం ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదు కదా! “జగన్ కొట్టినప్పుడు ప్రజలు తీసుకున్నారు.., ఇప్పుడు ప్రజలు కొట్టారు… తీసుకోవాలి జగన్… తప్పదు..!





