జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలన పూర్తవడంతో వైసీపీ శ్రేణుల హడావుడి, నేతల సొంత డప్పు మొదలైపోయింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా రాకపోతే రాష్ట్రంలో యువతకు తీరని అన్యాయం జరిగిపోతుందని, తాను అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని పదేపదే చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపడేశారు.
ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రంలో యువతకు తీరని అన్యాయం జరిగిపోతుందని సిఎం జగన్మోహన్ రెడ్డి నిజంగా భావిస్తున్నట్లయితే దాని కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చేవారు. కానీ ఆయన కేంద్రాన్ని సంక్షేమ పధకాలకు నిధుల కోసం మాత్రమే అడుగుతున్నారు. కనుక నిధుల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టడానికి వెనకాడలేదు. సిఎం జగన్మోహన్ రెడ్డికి నెలనెలా నిధులు తప్ప మరేమీ అక్కరలేదు కనుక కేంద్రం కూడా ఆయన బలహీనతను గుర్తించి ప్రత్యేకహోదా ఇవ్వదలచుకోలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
దీనిని బట్టి ప్రత్యేక హోదా విషయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి టిడిపిని దెబ్బతీసి తాను అధికారం చేజిక్కించుకోవడం కోసమే ప్రత్యేక హోదాను వాడుకొన్నారని అర్దమవుతూనే ఉంది.
ఇక మూడేళ్ళ జగన పాలనలో మరో పెద్ద వైఫల్యం అమరావతిని నిర్లక్ష్యం చేయడం. దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే నష్టపోతారనే తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆ కారణంగా రాష్ట్రానికి రావలసిన లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి, పక్కనే ఉన్న హైదరాబాద్ నగరానికి వెళ్లిపోయాయి.
కానీ హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేస్తుండటంతో మూడేళ్ళ తరువాత అయిష్టంగానే అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ అవి పూర్తిచేసేందుకు ఆరేళ్ళు పడుతుందని హైకోర్టుకి చెప్పడం ద్వారా అప్పటి వరకు పూర్తి చేయదలచుకోలేదని స్పష్టం అవుతోంది.
రాష్ట్రానికి బలమైన రాజధాని లేకపోవడం వలన మూడేళ్ళలోనే లక్షల కోట్లు పెట్టుబడులు చేజారిపోతే మరో ఆరేళ్ళు రాజధాని లేకపోతే ఇంకెంత నష్టపోతుందో ఎవరూ లెక్క కట్టలేరు కూడా. కానీ అందుకు సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ ప్రభుత్వంలో ఎవరూ ఏమాత్రం చింతిస్తున్నట్లు లేకపోవడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం.
ఇక పోలవరం ప్రాజెక్టు మూడో వైఫల్యంగా కళ్లెదుటే కనబడుతోంది. తాము అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టుని కేంద్రానికి అప్పగించేస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక దానిని వదులుకొనేందుకు ఇష్టపడలేదు… దేనికి? అంటే అదో బంగారు గుడ్లు పెట్టె బాతు వంటిది కనుక! పోలవరం పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సిన జగన్ ప్రభుత్వం, దాని పనులు ముందుకు సాగకుండా రివర్స్ టెండరింగ్ అంటూ రకరకాల అవరోధాలు సృష్టిస్తూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ మూడేళ్ళు కాలక్షేపం చేసేసింది.
ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో అందరూ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేశారు కనుక మిగిలిన ఈ రెండేళ్ళలో పోలవరం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోతుందని భావించవచ్చు. కేవలం ఏడేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ 1గా గర్వంగా నిలబడితే, కేవలం మూడేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళపాటు కోలుకోలేని స్థితికి తీసుకువచ్చిన ఘనత మన సిఎం జగన్మోహన్ రెడ్డిగారిదే అని ప్రజలు, ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.



