ప్యాలస్‌లో ప్రతిపక్షం… సోషల్ మీడియాలో రాజకీయాలు!

Ys Jagan: Opposition in Palace... Politics on Social Media!

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలస్‌ నుంచి బయటకు వచ్చింది తక్కువ. పదవి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్‌ ప్యాలస్‌లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు.

ADVERTISEMENT

అప్పుడు బటన్ నొక్కేందుకు మాత్రమే బయటకు వస్తుండేవారు. ఇప్పుడు శవరాజకీయాలు చేసేందుకు మాత్రమే వస్తున్నారు. అంతే తేడా!

జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లోనే నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తుంటే, వైసీపి నేతలు, మద్దతుదారులు సోషల్ మీడియాలో రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అధికారం కోల్పోయి 4 నెలలు గడుస్తున్నా జగన్, వైసీపి నేతలు ప్రజల మద్యకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు ఏవిదంగా పనిచేయాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆచరణలో చేసి చూపారు. అదే సమయంలో పార్టీ నేతలు ఏవిదంగా పని చేయాలో టిడిపి నేతలు చూపారు.

కానీ జగన్‌ చంద్రబాబు నాయుడుని కాక తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నారు. కేసీఆర్‌ పదవి, అధికారం కోల్పోయినప్పటి నుంచి అంటే దాదాపు 10 నెలలుగా తన ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. బయటకు రావడం పూర్తిగా మానేశారు. కానీ కొడుకు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్ రావు చేత రాజకీయాలు చేయిస్తూ పార్టీ చురుకుగా ఉన్నట్లు ప్రజలకు చూపించుకుంటున్నారు.

కానీ జగన్‌కి ఇటువంటి కష్టకాలంలో అండగా నిలబడేందుకు తల్లీ చెల్లీ ఇద్దరూ లేరు. పార్టీలో ముఖ్యనేతలు అందరూ కూడా సోషల్ మీడియాలో కనబడుతుంటారు తప్ప ప్రజల మద్య కనపడటం లేదు.

తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపి చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు కనపడింది, కానీ అది కూడా చల్లబడటంతో ప్రస్తుతం వైసీపి నిద్రాణ స్థితిలోకి జారుకున్నట్లుంది.

తాడేపల్లి ప్యాలస్‌ సమావేశాలలో జగన్‌ తాను రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మేలు చేశానని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే మరి తాను మేలు చేసిన జనం మద్యకు వచ్చేందుకు జగన్‌ ఎందుకు జంకుతున్నారు?

బహుశః టిడిపి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందనే భయంతోనే కావచ్చు. ఇటీవల తిరుమల పర్యటన చివరి నిమిషంలో రద్దు చేసుకోవడమే ఇందుకు తాజా నిదర్శనం.

కానీ తన ప్రభుత్వం జగన్‌లాగ దుర్మార్గంగా వ్యవహరించదని సిఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారుకదా? కనుక జగన్, వైసీపి నేతలు నిర్భయంగా బయటకు రావచ్చు. రాష్ట్రంలో ఎవరో చనిపోతేనే తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు వద్దామని ఎదురుచూస్తూ కూర్చుంటే వైసీపి క్యాడర్ చెల్లాచెదురు అయిపోవడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories