ఓటమి ఎదురయినప్పటికీ జగన్ తన రాజకీయ అడుగులు వేగంగా వేస్తున్నారు. బెంగళూర్ టూ తాడేపల్లి డైలీ సర్వీస్ చేస్తూనే ఏపీలోనూ రాజకీయ వేడి రాజేస్తున్నారు. రాష్ట్రంలో అనూహ్యంగా కురిసిన వర్షాలతో వచ్చిన వరదలతో ఇటు సాయం కోసం బాధితులు, సహాయక చర్యలలో ప్రభుత్వం బిజీగా ఉంది.
అయితే వైసీపీ కూడా తన బురద రాజకీయాలతో, అసత్య ప్రచారాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధం చేయడంలో బిజీగా గడుపుతుంది. విజయవాడలో వచ్చిన బుడమేరు వరదలను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతుంది వైసీపీ.
విపత్తును ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, అధికారులు హెచ్చరిస్తున్న బాబు నిర్లక్ష్యం వహించారని, అలాగే బాధితులకు కూడా ప్రభుత్వ యంత్రంగం సరైన వసతులు కల్పించడంలో విఫలమయ్యింది అంటూ జగన్, బాబు నాయకత్వాన్ని తప్పుబడుతున్నారు.
అలాగే విజయవాడ వరద బాధితుల పరామర్శకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు అంటూ మండిపడింది వైసీపీ. అయితే ఇన్ని కబుర్లు చెప్పి ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు చేసి తీరా బాధితులకు వైసీపీ నేతలు చేసింది ఏమైనా ఉందా అంటే అది మాత్రం ఇప్పటికి ఒక అంతు చిక్కని సమాధానమనే చెప్పాలి.
విజయవాడ వరదలలో జగన్ చేసిన బురద రాజకీయం రిటైనింగ్ వాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు విస్తరించి టీడిపి vs వైసీపీగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన బురద రాజకీయంతో వైసీపీ ప్రజలలో ఇంకాస్త పలుచనైందనే చెప్పాలి.
అయితే ఇక్కడ వైసీపీ కి ఆశించిన సానుక ఫలితాలు రాకపోవడంతో నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో వరద ముంపు కు గురైన మాధవరం, నాగుపల్లి, రమణక్క పేటలో జగన్ పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. అయితే సదరు వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే పవన్ సందర్శించి బాధితులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సాయం అందుతుంది అంటూ భరోసా కల్పించారు.
దానికి తోడు గత వైసీపీ హయాంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలు అన్ని వరద ప్రభావిత ప్రాంతాలు అని, వాటిలో కూడా జగన్ కనీస వసతులైనా రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మించక పోవడం ఫలితంగానే ఈ ప్రాంతాలు మరింత వరద ముంపుకు గురయ్యాయంటూ వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.
అయితే పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో మాజీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న చర్చ స్థానికంగా ఊపందుకుంది. పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జగన్ పవన్ ను ఉద్దేశించి నేరుగా ఎటువంటి విమర్శలు గుప్పించలేదు.
ఈ నేపథ్యంలో గతంలో మాదిరే పవన్ పై జగన్ వ్యక్తిగత దాడి చేసే సాహసం చేస్తారా.? లేక కేవలం రాజకీయ విమర్శలతో సరిపెడతారా.? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇన్నాళ్ళుగా కనీసం పవన్ ను పేరు పెట్టి కూడా పిలువని జగన్ ఇప్పుడు పవన్ ను ఎలా పిలుస్తారు, ఏ విధంగా విమర్శిస్తారు అంటూ అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అలాగే జగన్ ఏమైనా హద్దు దాటి పవన్ పై విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ఇవ్వడానికి కూడా జనసేన శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే విజయవాడలో వైసీపీ చేసిన వరద రాజకీయంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర జగన్ మునిగారు. దీనితో పిఠాపురంలో అయినా జగన్ తేలుతారా అనేది సందేహమే. గత వారం రోజులుగా టీడీపీ vs వైసీపీ గా సాగిన ఈ విమర్శలు ఇప్పుడు జనసేన vs వైసీపీ గా మారనున్నాయా.?




