రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేందుకే ప్రజలు పార్టీలకు అధికారం కట్టబెడతారు. వారు మంత్రివర్గాలు ఏర్పాటుచేసుకొంటారు. ఆ మంత్రుల శాఖలలో అపారమైన అనుభవం, నైపుణ్యం కలిగిన లక్షలాదిమంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తుంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదేవిధానంలో పరిపాలన సమర్ధంగా సాగుతోంది. అయితే రాజకీయ పార్టీల ఆలోచనలలో మార్పులు, వాటిలో కూడా రాజకీయ నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో వారందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.
ఆ విదంగా ఏర్పడినవే వివిద కార్పొరేషన్లు…. వాటికి చైర్మన్లు, డజన్ల కొద్దీ ప్రభుత్వ సలహాదారుల నియమకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు. ప్రభుత్వంలో భాగంగా అనేక శాఖలు, వాటిలో లక్షలాదిమంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తుండగా ఈవిదంగా సమాంతర వ్యవస్థలను, సిబ్బందిని నియమించడమంటే త్రిశంకు స్వర్గం సృష్టించినట్లే అని చెప్పవచ్చు. వాటి వలన ఏటా వేలకోట్ల ప్రజాధనం ఖర్చయిపోతోంది.
ఉదాహరణకి సుమారు 4-5 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.5,000 జీతం (సాక్షి పేపర్ కొనుక్కోవడానికి అదనంగా మరో రూ.200), మద్యలో అవార్డుల పేరుతో బోనసులు కలిపి ఏడాదికి ఎన్ని వేలకోట్లు ఖర్చు అవుతున్నాయో లెక్కించుకోవచ్చు. అయితే వాలంటీర్లు ప్రజల కంటే వైసీపీ పార్టీ ప్రతినిధులుగానే ఎక్కువ పనిచేస్తుండటం అందరూ చూస్తున్నారు. అంటే వైసీపీ రాజకీయ అవసరాల కోసం సృష్టించుకొన్న ఈ వ్యవస్థకి ప్రజలందరూ జీతాలు చెల్లిస్తున్నారన్న మాట!
ఇక రాష్ట్రంలో ఎక్కడికక్కడ మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాలు, వాటిలో వేలాదిగా సిబ్బంది ఉండగా వాటికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం సృష్టించడం వలన మున్సిపల్, రెవెన్యూ విధులు, బాధ్యతలు, అధికారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, స్టాండింగ్ కమిటీలు, మళ్ళీ ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మంత్రుల కమిటీలు ఉండగా ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తారో?వారు ఎవరికి సలహాలు ఇస్తారో? అసలు వారి అవసరం ఏమిటో అర్దం కాదు.
వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారికంగా 45 మంది సలహాదారులు ఉన్నట్లు సమాచారం. రహస్యంగా దాచిపెట్టిన జీవోల ద్వారా ఇంకా ఎంతమందిని నియమించుకొని పోషిస్తోందో తెలియదు. కానీ ఒక్క ప్రభుత్వ సలహాదారులపైనే ఏడాదికి సుమారు రూ.83.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంకా రహస్య సలహాదారులపై ఎంత ఖర్చు చేస్తోందో ఎవరికీ తెలియదు. ప్రజలు కష్టార్జితంతో పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము నుంచే వారందరికీ జీతభత్యాలు చెల్లిస్తుండటం నిజం!
అత్యవసరమైనప్పుడు మేధావులు, నిపుణులను తాత్కాలికంగా నియమించుకొని వారికి గౌరవవేతనం చెల్లించి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పు కాదు. కానీ పార్టీలో రాజకీయ నిరుద్యోగులతో ఇబ్బందులు రాకూడదనో, అందరినీ సంతృప్తిపరచడానికో ఇలా త్రిశంకు స్వర్గం వంటి సమాంతర వ్యవస్థలను సృష్టించడం, వారి కోసం సామాన్య ప్రజలను పీడించడం అవసరమా?
రాజకీయ క్రమశిక్షణ లేకపోతే పాయే… కనీసం ఆర్ధిక క్రమశిక్షణ అయినా కలిగి ఉండాలి కదా?ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కోసం అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే ఆలోచించే దూరదృష్టి కలిగిన వైసీపీ అధిష్టానానికి, రాష్ట్ర భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందనే దూరదృష్టి కూడా ఉండాలి కదా?



