గురువులకి పంగనామాలు… విద్యార్థులకి ట్యాబ్‌లు!

Samsung-Tabs-to-Andhra-Pradesh-Government-Shool-Students-నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రూ.686 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 5,18,740 ట్యాబ్‌లను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి పంపిణీ చేస్తున్నారు. సిఎం జగన్‌ బాపట్ల జిల్లా యడ్లవల్లిలో విద్యార్థులకి ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సిఎం జగన్‌ విద్యార్థులని, వారి తల్లితండ్రులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇంతకాలం ధనికులకి, పెత్తందారీ కుటుంబాల పిల్లలకి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందుబాటులో ఉండేది. అది చూసి నిరుపేద విద్యార్థుల తల్లితండ్రులు బాధపడుతుండేవారు. తమ పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియంలో చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకొనేవారు. కనుక వారికీ సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే నేను ఇంగ్లీషు మీడియం, డిజిటల్ విద్యని కూడా అందించాలనే ఉద్దేశ్యంతోనే ఇవన్నీ చేస్తున్నాను.

ADVERTISEMENT

ఒక్కో ట్యాబ్‌లో బైజూస్ అందిస్తున్న కంటెంట్ విలువ రూ.32,000. దానిని పూర్తి ఉచితంగా విద్యార్థులకి అందజేస్తున్నాము. పిల్లలకి హానికరమైన అంశాలు ఏవీ ట్యాబ్‌లో లేకుండా డిజైన్ చేయించము. ఇంటర్నెట్ సౌకర్యం లేనప్పటికీ పిల్లలు ట్యాబ్‌లలో పాఠాలు చదువుకోగలరు. రాష్ట్రంలో ప్రతీ మహిళకి ఓ అన్నగా, వారి పిల్లలకి ఓ మేనమామగా వారి బాగోగులు చూసుకొంటున్నాను,” అని అన్నారు.

సిఎం జగన్‌ మాటలకి, చేతలకి ఎంత తేడా ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకి, ఉపాధ్యాయులకి నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తునే ఉన్నారు. కానీ వారి ఆందోళనలపై స్పందించని సిఎం జగన్‌ రూ.686 కోట్లతో 5,18,740 ట్యాబ్‌లను కొని పంచిపెడుతున్నారు. విద్యార్థుల చేతిలో ట్యాబ్‌లు పెడితే చాలు వారి జీవితాలు మారిపోతాయన్నట్లు సిఎం జగన్‌ మాట్లాడుతున్నారు. అంటే ట్యాబ్‌లు వాటిలో బైజూస్ పాఠాలు ఉంటే ఉపాధ్యాయులు అవసరమే ఉండదన్న మాట!

రాష్ట్రంలో ప్రతీ అక్కకీ, చెల్లికీ, తమ్ముడికీ నేనున్నానని సిఎం జగన్‌ చెపుతున్నారు. కానీ సొంత తల్లి విజయమ్మని, చెల్లి షర్మిలని బయటకి పంపేశారు. సుమారు మూడున్నరేళ్ళ క్రితం బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకి గురైతే ఇంతవరకు హంతకులను కోర్టులో నిలబెట్టలేకపోయారు. జగనన్న రాజ్యంలో తనకు న్యాయం జరగదని చెపుతూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆ కేసు విచారణని తెలంగాణకి బదిలీ చేయించుకొన్నారు. సొంత తల్లి, చెల్లి, బాబాయ్, ఆయన కుమార్తెకి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రంలో మహిళలందరికీ న్యాయం చేస్తానని, అండగా నిలబడతానని వాగ్ధానం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories