మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నాటకీయ పరిణామాల మధ్య రద్దయ్యింది. ఇప్పటికే లడ్డు ప్రసాదం తయారీలో అపచారం జరిగిందంటూ శ్రీవారి భక్తులు వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఇటువంటి సందర్భంలో జగన్ తిరుమల యాత్ర తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.
అయితే అన్య మతస్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వారు ఖచ్చితంగా తమకు ఆ దేవ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద పూర్తి నమ్మకం ఉంది అంటూ ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చెయ్యవలసి ఉంటుంది. అయితే గత ఐదేళ్లుగా జగన్ ముఖ్యమంత్రిగా ఎన్ని సార్లు తిరుమలకు వెళ్లిన ఈ సంప్రదాయాన్ని కాలరాస్తూ యథేచ్ఛగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలి అని వైసీపీ నేతలు భావించినా, ఇప్పుడున్న పరిస్థితులలో డిక్లరేషన్ లేకుండా తిరుమల దర్శనం అంటే అది సాధ్యమయ్యే పనికాదని ముందుగానే గ్రహించిన మాజీ ముఖ్య మంత్రి తోకముడిచి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.
అలాగే తన తిరుమల పర్యటన రద్దు వెనుక దాగి ఉన్న ఆ రహస్యాన్ని వివరించడానికి మీడియా ముందుకు రావడానికి సిద్ధం అంటూ ప్రకటించారు జగన్. అలాగే తిరుమల జగన్ పర్యటన పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు అంటూ వైసీపీ మరో కోడికత్తి, గులకరాయి తరహా డ్రామాకు తెరలేపింది.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన వైస్ జగన్ కనీసం దేవుని దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం తన పై కుట్ర చేస్తుందని, నా జీవితంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నేడు ఏపీలో నడుస్తుందని, తన పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేస్తామంటూ బెదిరించడం ఇదే తొలిసారి చూస్తున్నాను అంటూ జగన్ తన కళ్ళబుల్లి కబుర్లు వినిపిస్తున్నారు.
అసలు జగన్ తిరుమల వెళ్ళేది ఆ వెంకన్న మీద భక్తితోనా.? లేక తన పార్టీ నేతలు తన వెనుక వస్తారన్న నమ్మకంతోనా.? లేక ప్రభుత్వం మీద పగతోనా.? పార్టీ నేతలు తన వెనుక రాకపోవడం వలన తన పర్యటనకు వచ్చిన నష్టమేమిటో జగన్ వివరించగలరా.? అయినా జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోమని ప్రభుత్వం అధికారులకు ఎటువంటి నోటీసులు అందించలేదు.
కేవలం తిరుమల సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల స్వామి వారి దర్శనం పూర్తి చేసుకోవాలని మాత్రమే ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అసలు తిరుమల సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేసి తిరుమల వెళ్ళడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి.? హిందూ దర్మం పట్ల జగన్ కు గౌరవం లేదు అని తన మీద వచ్చిన అపవాదును తుడుచుకోవడానికి జగన్ కు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.
కానీ జగన్ డిక్లరేషన్ ఇవవడానికి సుముఖంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లి భంగపాటుని ఎదుర్కోవడం కంటే ఇక్కడే తిరుమల పర్యటనకు గోవిందా చెప్పి నెపం ప్రభుత్వం మీద వేసి తప్పించుకోవడం మంచిదనే భావనతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
హిందూ ధర్మాన్ని గౌరవించలేని వారు, సంప్రదాయాలను పాటించలేని వారు, ఆచార వ్యవహారాలకు విలువ ఇవ్వలేని వారు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి మత విద్వేషాలు రెచ్చకొట్టే యాత్రలకు శ్రీకారం చుడతారు అంటూ ఆ శ్రీనివాసుని భక్తులు వైసీపీ పని ఇక గోవిందా గోవిందా…అంటూ మండిపడుతున్నారు.




