టిడిపి ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేకపోతుంటే, జగన్ ఏమీ చేయకుండానే అన్నీ చేశానని డబ్బా కొట్టుకొంటుండటం విశేషం.
విజయవాడలో వరదలు వస్తే సిఎం చంద్రబాబు నాయుడు అహోరాత్రులు కష్టపడి పనిచే(యి)స్తున్నారు…. అని ఆయనను అమితంగా ద్వేషించే తెలంగాణలోని బిఆర్ఎస్ నేతలే చెపుతున్నారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతూ మూడు రోజులలోనే నగరాన్ని చక్కదిద్దారని ప్రశంశించారు. చివరికి విదేశాలలో ఉన్నవారు కూడా విజయవాడలో జరుగుతున్నా సహాయ చర్యలని ప్రశంశిస్తున్నారు. కానీ విజయవాడలో నిలబడి మాట్లాడుతున్న జగన్కు చుట్టూ జరుగుతున్నవి ఏవీ కనపడటం లేదు!
మంత్రి నిమ్మల రామానాయుడు కుండపోతగా వాన కురుస్తుంటే అర్ధరాత్రిపూట బుడమేరు వద్ద నిలబడి గండ్లు పూడ్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీరాజ్ శాఖలో అధికారులు, ఉద్యోగులను పరుగులుపెట్టిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నారు.
మిగిలిన మంత్రులు కూడా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ వరద విపత్తుని అధిగమించడానికి చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు.
టిడిపి కూటమి ప్రభుత్వం పనితీరు ఎంత సమర్ధంగా ఉందో తెలుసుకునేందుకు జగనే సాక్ష్యం అంటే నమ్మక తప్పదు. ఏనాడూ కాలు కింద పెట్టని జగన్ మొన్న ఫోటోల కోసం మోకాలి లోతు నీళ్ళలో నిలబడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో పరిశుభ్రంగా మారిన రోడ్ మీద నిలబడి టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లకు అప్పుడే మరమత్తులు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది నగరంలో ముంపు ప్రాంతాలలో ప్రతీ ఇంటినీ ‘ప్రెషర్ వాటర్’తో శుభ్రం చేసి ఇస్తుంటే చూసి మహిళలు చాలా సంతోషిస్తున్నారు.
నగరంలో వైద్య సిబ్బంది ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు వైద్య సేవలు అందిస్తున్నారు. మొబైల్ బృందాలు ఇంటింటికీ తిరుగుతూ ఎవరికైనా జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు బాధపడుతున్నారా? అని అడిగి తెలుసుకొని అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
విద్యుత్ అధికారులు, సిబ్బంది రేయింబవళ్ళు పనిచేస్తూ ముంపు ప్రాంతాలలో విద్యుత్ పునరుద్దరించారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఇంత వేగంగా పనిచేస్తుండటంతో, వరద నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందాలకు ఏమి చూపించాలో తెలీని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది మంది అధికారులు, ఉద్యోగులు, పారిశుద్య కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తునందునే కేవలం రెండు రోజులలోనే నగరంలో ఇంత మార్పు తీసుకురాగలిగారు.
కానీ ఇది గుర్తించన్నట్లు జగన్ ఇంకా ఇది ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆయన రోడ్లపై దుష్ప్రచారం చేస్తుంటే, ఆయనకు వత్తాసుగా సాక్షి మీడియా, వైసీపి సోషల్ మీడియా రెండూ యధాశక్తిన దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి.
ఇటువంటి కష్టకాలంలో జగన్ మాటలు వింటుంటే ఆయన తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు రాకుండా ఉంటేనే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో అందరి దృష్టి సహాయ పునరావాస చర్యలపైనే ఉండటంతో జగన్, ఆయన సొంత మీడియా ఇంతగా రెచ్చిపోతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇక తనకు అడ్డే లేదన్నట్లు జగన్, వారి మీడియా రెచ్చిపోతోంది.
టిడిపి కూటమిలో, ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. జగన్ ఇంతగా రెచ్చిపోతుంటే వారు అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ జగన్ దూకుడు చూస్తుంటే, ప్రభుత్వంలో మంత్రులకి శాఖలు కేటాయించిన్నట్లే, టిడిపిలో కూడా జగన్ కోసం ప్రత్యేకంగా ఓ శాఖని సృష్టించుకొని ధీటుగా ఎదుర్కోవడం చాలా అవసరమనిపిస్తోంది. లేకుంటే జగన్, ఆయన సొంత మీడియా పదేపదే చెపుతున్న అబద్దాలు నిజమే అని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది.




