ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల పుణ్యమాని వివిద పార్టీ నాయకులు ఎంతెంత ఆస్తులు పోగేసుకున్నారో బయటపడుతోంది. నిజానికి వారు అఫిడవిట్లలో బయటపెట్టేదానికి పదింతలు ఆస్తులు ఉంటాయని ఎన్నికల సంఘానికి కూడా తెలుసు. కానీ రాజకీయ నాయకుల చేతుల్లోనే వ్యవస్థలన్నీ ఉంటాయి కనుక వారిని ఎవరూ నిలదీసి అడగలేరు. వారు ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవలసిన అవసరం కూడా లేదు.
కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తమ ఆస్తుల మొత్తం విలువ రూ.181.79 కోట్లు అని పేర్కొన్నారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి రూ.82 కోట్లు, తన వదిన భారతికి రూ.19.56 కోట్లు కలిపి మొత్తం రూ.101.56 కోట్లు అప్పు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
అనంతరం ఆమె ఈ రెండు అప్పుల గురించి మీడియాతో మాట్లాడుతూ, “నేను దీని గురించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక ఈ విషయం మీతో చెపుతున్నాను. ఏ అన్న అయినా తన పిత్రార్జితంలో అక్క చెల్లెళ్ళకు వాటా పంచి ఇస్తాడు. ఇది ఆనవాయితీ. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ఆస్తిలో ‘చిన్న కొసరు’ నాకు ఇచ్చి దానిని కూడా అప్పుగా చూపాడు. ఇది వాస్తవం. ఇది మా వైఎస్ కుటుంబంలో అందరికీ తెలుసు,” అని వైఎస్ షర్మిల అన్నారు.
జగన్ దంపతులు చెల్లి షర్మిలకు అప్పుగా ఇచ్చిన కోసరే 101.56 కోట్లు ఉంటే ఇంకా అసలు ఎంతుందో? అనే సందేహం కలుగకపోదు. దాని గురించి ఎవరో బయటపెట్టక్కర లేదు. జగన్మోహన్ రెడ్డి న్యాయవాది పెద్దిరెడ్డి శంభు ప్రసాద్ సంతకం చేసి సమర్పించిన అఫిడవిట్ సోషల్ మీడియాలోనే ఉంది. అది చూస్తే కళ్ళు తిరిగిపోతాయి.
దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డికి 7, ఆయన సతీమణి భారతికి 23, వారి పెద్ద కుమార్తె హర్షిణికి 7, చిన్న కుమార్తె వర్షారెడ్డికి 10 కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయి. అయినా ఎవరి చేతిలో పట్టుమని 10 వేలు కూడా ఉండవు. ఆ అవసరం లేదు కూడా. ఎందుకంటే డబ్బుతో చేయగల పనులన్నిటినీ వారు నోటి మాటతోనే ఇంకా చెప్పాలంటే కంటి సైగతోనే చేయగల సమర్ధులు కనుక!
జగన్ ఆస్తిలో కొసరి వాటా విలువ: రూ.101.56 కోట్లు కానీ ఆయన రాష్ట్రంలో పేదలకు సెంటు భూమి ఇస్తే చాలనుకుంటారు.




