ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల, మూడు నెలల్లో తన అన్న జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. అసలు ఆమె ఆ స్థాయిలో అన్నావదినలపై విరుచుకుపడతారని ఎవరూ ఊహించలేదు.
ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక జగన్, వైసీపి నేతలు, సజ్జల, విజయసాయి తదితరులతో కూడిన సలహా మండలి, ఐప్యాక్కి కూడా అర్ధంకాక అందరూ తలలు పట్టుకున్నారు. ఆమె కడప నుంచి లోక్సభకు పోటీ చేయడం, వివేకా హత్య గురించి నిలదీస్తుండటంతో జగన్, అవినాష్ రెడ్డి ఇద్దరూ బిత్తరపోయారు.
ఎన్నికలలో ఆమె జోరు చూసినవారు కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవకపోయినా ఆమె తప్పకుండా గెలుస్తారనే అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మళ్ళీ అవినాష్ రెడ్డే గెలిచారు. ఇది ఆమెకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
టిడిపి కూటమి భారీ మెజార్టీతో గెలుపుకి కారణం రిగ్గింగ్ చేయడం, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే అని తీర్మానించేసిన జగన్, కడపలో అవినాష్ రెడ్డి గెలుపుపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.
వైఎస్ షర్మిల గెలవకపోయినా, తన పార్టీలో ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయినా అన్న జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమయ్యారని చెప్పక తప్పదు.
ఒకవేళ ఎన్నికలకు ముందు ఆమె ఏపీలో ప్రవేశించకుండా ఉంటే, రెడ్డి, క్రీస్టియన్, దళిత ఓట్లన్నీ వైసీపికే పడి ఉండేవేమో?వాటితో జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేకపోయినా కనీసం శాసనసభలో గౌరవప్రదమైన స్థానాలు సంపాదించుకుని ఉండేవారు.
ఏది ఏమైనప్పటికీ వైఎస్ షర్మిల వచ్చిన పని (అన్నను ఓడించి గద్దె దించడం) అయిపోయిన్నట్లు మాయం అయిపోయారు. ఆమె మళ్ళీ తిరిగివస్తారో లేదో తెలీదు. వచ్చినా ఏపీ కాంగ్రెస్ నేతలెవరూ ఆమెను నమ్మి మరో 5 ఏళ్ళపాటు టిడిపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రాకపోవచ్చు.
కానీ ఇంకా జగన్ పంచన ఉండటం తమకు ప్రమాదమని భావిస్తున్న వైసీపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టిడిపి, జనసేనలో చేరే అవకాశం లేదు కనుక వారిని ఆమె కాంగ్రెస్ పార్టీలో రప్పించుకోగలిగితేనే రాష్ట్రంలో రాజకీయాలు చేయగలరు. లేకుంటే ఆమె పరిస్థితి, ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తాయి.




