దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని వైసీపీ నేతలు గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పట్టికీ అది దారుణహత్యే అని సీబీఐ పక్కా సాక్షాధారాలతో సహా నిరూపిస్తోంది. అయితే ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని సీబీఐ చెప్పగా, ఆయన తనకి ఈ కేసుతో ఎటువంటి సంబందమూ లేదని, కానీ సీబీఐ తనని అన్యాయంగా ఇరికించిందని, ప్రత్యర్ధి పార్టీ అనుకూల మీడియా కూడా తనని దోషిగా చిత్రీకరిస్తుండటంతో తీవ్ర మానసిక వేదనకి గురవుతున్నానని చెప్పారు.
అయితే వివేకా హత్యకి అవినాష్ రెడ్డే ప్రధానకారకుడని మొన్న కోర్టులో సీబీఐ కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేసింది. ఇదే కేసులో నేడు ఆయనని మరోసారి విచారించేందుకు హైదరాబాద్కి పిలించిది కూడా.
ఇక ఈ కేసుతో తనకీ ఎటువంటి సంబందమూ లేదని పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ చెపుతున్నారు. వివేకా హత్య జరిగిన రోజున ‘తెల్లవారుజామున’ తాను వేరేపని మీద ఆయనని కలిసేందుకు వెళ్ళానని, అదే సమయంలో అవినాష్ రెడ్డి, వైసీపీకి చెందిన మరికొందరు నేతలు కార్లలో వచ్చి హడావుడిగా లోపలకి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత బయటకి వచ్చి ఆందోళనగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడారని శశికళ చెప్పారు.
అప్పటికే అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారని వారు వివేకా హత్య చేయబడ్డారని చెప్పుకొంటుంటే వారి మాటలు నమ్మలేక తాను లోపలకి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో చనిపోయున్న వివేకాని చూసి వెంటనే బయటకి వచ్చి ఇంటికి వెళ్ళిపోయానని చెప్పారు. ఆ సమయంలో నేను వివేక గుండెపోటు వచ్చి రక్తం కక్కుకొని చచ్చిపోయారని ఎవరితో చెప్పలేదని, అవినాష్ రెడ్డితో మాట్లాడలేదని, ఆయన కూడా తనతో మాట్లాడలేదని శశికళ చెప్పారు. కానీ తాను వివేక గుండెపోటు వచ్చి రక్తం కక్కుకొని చచ్చిపోయారని చెప్పానని సీబీఐ తన పేరుని అన్యాయంగా ఈ కేసులో జోడించిందని శశికళ ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో నిందితులు లేదా వారికి సహాయపడిన వారందరూ తమకి ఈ కేసుతో ఎటువంటి సంబందమూ లేదని చెపుతున్నారు. మరైయితే వివేకాని హత్య చేసినవారెవరు? వైసీపీ నేతలు వివేకా హత్యని ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు?వివేకా హత్య కేసుని చేధించి హంతకులని, వారికి సహకరించిన వారికి చట్ట ప్రకారం శిక్షలు వేయించేందుకు కృషి చేస్తున్న సీబీఐని ఎందుకు నిందిస్తున్నారు?ఏ తప్పు చేయకపోయి ఉంటే భయం ఎందుకు? విచారణ కీలకదశకి చేరుకొంటునప్పుడు ఈవిదంగా వాదించడంలో అర్దం ఏమిటి? అనే ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది.




