తండ్రి మరణంతో పుట్టిన పార్టీ, విగ్రహ రాజకీయాలతో ఎదిగిన పార్టీ, కుటుంబాలను చీల్చే రాజకీయాలతో ముందుకెళ్తుందా.? అన్నట్టుగా వైసీపీ రాజకీయం నిండు కుటుంబాలను నిట్టనిలుగా చీలుస్తున్నాయి.
వైఎస్ఆర్ పేరుతో పుట్టిన పార్టీ చివరికి ఆ వైఎస్ఆర్ కుటుంబాన్నే రెండుగా చీల్చేసి అన్నా చెల్లెళ్లను ఆగర్భ శత్రువులుగా మార్చేసింది. ఒకపక్క జగన్ అధికార దాహం, మరోపక్క షర్మిల హక్కుల పోరాటం తో వైఎస్ కుటుంబం రెండు ముక్కలుగా చీలిపోయింది.
ఇక అదే పార్టీ లోని టెక్కలి సీటు కోసం జగన్ ఎంచుకున్న వ్యూహంతో దువ్వాడ కుటుంబం కూడా రెండు ముక్కలయింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి ఒక్క సీటు కోసం భార్య భర్తల ఇద్దరి పేర్లను జగన్ ప్రతిపాదించడంతో ఆ మూడు ముళ్ళ బంధం మూడో మనిషితో వివాహేతర సంబంధంగా మారి బజారుకెక్కింది.
ముందుగా శ్రీనివాస్ ను టెక్కలి అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ, ఆ తరువాత జరిపిన సర్వేలలో నియోజకవర్గంలో శ్రీనుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనే అంచనాతో ఆయన స్థానంలో శ్రీను భార్య దువ్వాడ వాణి పేరును ఖరారు చేసారు జగన్. జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే దువ్వాడ కుటుంబంలో చీలికకు భీజం వేసింది.
ఇక వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కుటుంబ విషయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరుగుతుంది. ఈసారి సురేష్ స్థానంలో ఆయన భార్య బేబీకి టికెట్ ఇస్తారని, ఆమె రాబోయే వైసీపీ ప్రభుత్వంలో కాబోయే హోమ్ మంత్రి అంటూ ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది.
అలాగే సురేష్ సతీమణి బేబీ కూడా తనను తానూ కాబోయే హోమ్ మంత్రిగా ఊహించుకున్న వైనాలను ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. భర్త స్థానంలో భార్యకు అవకాశం కల్పించడం ద్వారా వారిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యానికి అంకురార్పణ జరుగుతుంది.
ఇప్పుడు ఇదే ఫార్ములాను వల్లభనేని వంశీ విషయంలో కూడా అప్లై చెయ్యాలని వైసీపీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ గత చరిత్ర చూసినా, ప్రస్తుత పరిస్థితులు గమనించినా నియోజకవర్గంలో వంశీ గెలుపు అసాధ్యమనే చెప్పాలి.
దీనితో వంశీ స్థానంలో ఆయన భార్య పంకజ శ్రీ ని నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మహిళ కార్డు తో పాటుగా సానుభూతి అస్త్రం కూడా పంకజ శ్రీ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉందనేది వైసీపీ స్టాటజీ.
అయితే వంశీకి తన భార్య రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదనే అభిప్రాయం కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇన్నాళ్ల వంశీ రాజకీయ కెరీర్ లో పంకజ శ్రీ ఎక్కడ కనిపించలేదు. కేవలం వంశీ అరెస్టు తరువాత నుంచి మాత్రమే ఆయన సతీమణి మీడియాలో ఎక్కువగా సాక్షిలో దర్శనమిస్తున్నారు.
అయితే ఇక్కడ కుటుంబంలో అందరి ఇష్టపూర్వకంగా మహిళలు రాజకీయాలలోకి రావడం పెద్ద సమస్యగా మారదు, కానీ ఒక్కో సందర్భంలో భర్తకు బదులుగా భార్య అంటే దానిని సదరు వ్యక్తి తనకు జరిగిన అవమానంగా ఊహించుకునే అవకాశం ఉంది. ఒక రకంగా అది భర్త తన ఓటమిగా భావించే ప్రమాదం ఉంది.
తద్వారా కుటుంబాల మధ్య మొదలయ్యే రాజకీయ విభేదాలు కాస్త వ్యక్తిగత కలహాలుగా మారి చివరికి అవే కుటుంబాలను రెండుగా విభజిస్తున్నాయి. గతంలో జగన్, షర్మిల విషయంలోనూ, దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి విషయంలోనూ ఇది రుజువయ్యింది.
ఇప్పుడు ఈ రొచ్చులోకి నందిగామ సురేష్ కుటుంబం, వల్లభనేని వంశీ కుటుంబం దింపడానికి రంగం సిద్ధం చేస్తుంది వైసీపీ. ఇలా కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేయడంలో వైసీపీ కి అపార అనుభవం ఉందనే చెప్పాలి. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో వైసీపీ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, ఎన్ని కుటుంబాలను బజారుకు లాగినా ఇంకా గుణపాఠం మాత్రం నేర్చుకోలేకపోతుంది.






