దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజే ఘోర అవమానం చోటు చేసుకుంది. రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలోని చెన్నై సేవాదళం నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు… చివరికి వైఎస్ ఫోటోపైకి చెప్పులు విసిరేలా చేసింది. చెన్నై సేవాదళానికి ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న సైకం రామచంద్రారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించారని, తనను ఆ పదవిలో నియమించారని లక్ష్మీశ్రీదేవిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో వైఎస్ జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించేందుకు చెన్నైలో ఏర్పాటైన కార్యక్రమంలో సైకం -శ్రీదేవిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ముష్టి ఘాతాలు విసురుకున్న అనంతరం చెప్పులు, బూట్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వారు విసిరిన చెప్పులు అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ చిత్రపటంపై పడ్డాయి. అయినా సదరు విషయాన్ని పట్టించుకోకుండా ఇరువర్గాలు కోట్లాడుకోవడం విశేషం.
చెన్నైలో జరిగినా, ఏపీలో జరిగినా… తప్పిదం తప్పిదమే కావడంతో, మీడియా వర్గాలలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ‘నాయకుడి బట్టే కార్యకర్తలు’ అన్న చందంగా జగన్ వ్యవహార శైలిని చూసిన వారికి ఈ వైసీపీ వర్గపోరు కొత్త కాకపోవచ్చన్నది రాజకీయ వర్గాల మాట.



