తండ్రి వారసత్వంతో కొడుకు ఎదగాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అనుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ ఆ వారసత్వాన్నే అసహ్యించుకునేలా ప్రవర్తిస్తే మాత్రం దానిని ఎవరు సమర్ధించబోరు, ఆమోదించారు.
అయితే ఇప్పుడు ఈ సమస్యతోనే వైస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కుంటున్నారు. మార్చ్ 12 , 2011 న వైస్సార్ పేరుమీద వైసీపీ పార్టీని స్థాపించిన జగన్ ఒక తరం రాజకీయ నాయకుల భవిష్యత్ ను భూస్థాపితం చేస్తారు అని ఆనాడు ఎవ్వరు ఊహించలేదు.
కానీ, పార్టీ పెట్టిన 13 ఏళ్లకే ఆ పార్టీని నమ్ముకున్న యువనాయకత్వాన్ని జైలుపాలు చేస్తున్నారు జగన్. తన పాలనా రాహిత్యం, బరితెగింపు రాజకీయాలు, మూర్కత్వపు నిర్ణయాలు, ఫ్యాక్షన్ ఆలోచనలతో జగన్ చేసిన రాజకీయంతో ఒక తరం రాజకీయ నాయకుల భవిష్యత్ నాశనమైతే మరో తరం వారు రాజకీయం అంటేనే అసహ్యించుకునేలా చేసారు.
చేతిలో అధికారం ఉంటే దోషిని నిర్దోషిగా చూపించవచ్చు, తప్పుని ఒప్పుగా వక్రీకరించవచ్చు, దాడులను ప్రజా స్వామ్య హక్కుగా ప్రకటించవచ్చు, హంతకులను అమాయకులుగా చిత్రీకరించవచ్చు, దోపిడీకి అధికారక ముద్ర వేయవచ్చు అన్నట్లుగా వైసీపీ పార్టీలో ఉన్న యువనాయకులు పెంచి పోషించారు జగన్.
దాని ఫలితమే నేడు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, పేర్నినాని వారసుడు పేర్ని కిట్టు, సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి, పెద్ది రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పినిపే విశ్వరూప్ వారసుడు పినిపే శ్రీకాంత్ వంటి వారు గత ఐదేళ్ల అధికారంతో రాజకీయ నాయకులుగా కాకుండా రౌడీ షీటర్లు మాదిరి ఎవరి తండ్రి స్థాయికి తగ్గట్టు వారు రెచ్చిపోయారు.
అగ్రి గోల్డ్ భూ కుంభకోణం కేసులో ఇప్పటికే జోగి రాజీవ్ తన అహంకారానికి వడ్డీగా కటకటాలు లెక్కపెట్టివచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ ను హత్య చేసిన నేరానికి గాను పినేపి శ్రీకాంత్ ను మధురై లో అరెస్టు చేసారు ఏపీ పోలీసులు. అధికార అండ చూసుకుని చేసిన హత్యా నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవించనున్నారు శ్రీకాంత్.
ఇక ఐదేళ్ల తన తండ్రి అధికారాన్ని, జగన్ మద్దతుని తన అరాచకాలకు పునాదులుగా వేసుకుని సోషల్ మీడియాలో బరితెగించిన పోస్టులు పెడుతూ ప్రత్యర్థి పార్టీల మహిళలను, మహిళ నేతలను అవమానించిన ఘనుడు సజ్జల భార్గవ్ రెడ్డి. ఇతను చేసిన ఈ మహా పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా ఉండదనే చెప్పాలి.
అలాగే తండ్రి అండతో, జగన్ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు పుడింగి లా చెలామణి అయిన మిథున్ రెడ్డి ఇప్పుడు కనీసం ఆ ప్రాంతంలో తన నీడ కూడా వేయలేని పరిస్థితికి వచ్చారు. తండ్రి నోటి దూలకు తోడు ఈయన గారి ఓవర్ యాక్షన్ మితిమీరడంతో బందరు ప్రజలు పేర్ని కిట్టు ని అసలు రాజకీయ నాయకుడిగానే గుర్తించలేదు.
జగన్ కు నేను పెద్దపాలేరు అంటూ గర్వంగా చెప్పుకున్న తండ్రి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటే, జగన్ కు నేను సేవకుడిని అంటూ ప్రచారం చేసుకున్న కొడుకుని రాజకీయ సన్యాసిగా మార్చారు మచిలీపట్నం ఓటర్లు. ఇలా జగన్ కేవలం తన పదవి కాంక్ష కోసం, తన అక్రమ ఆస్తుల కేసుల నుండి తప్పించుకోవడం కోసం తన రాజకీయంతో ఒక తరం యువ నాయకత్వ భవిష్యత్ ను సర్వ నాశనం చేసారు.
తన తండ్రి వారసత్వాన్ని అందుకుని తానూ రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న జగన్ వీరందరికి తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి రౌడీ రాజ్యం తెచ్చారు.
ఒకవేళ భవిష్యత్ లో వైసీపీ రాష్ట్రంలో అధికారాన్ని అందుకోలేకపోతే ఈ యువ నాయకులకు ఏ పార్టీలోనూ అవకాశం లేకుండా చేసి వారి రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకంలో పెట్టారు జగన్. మా భవిష్యత్ నువ్వే జగనన్నా అంటూ నమ్మారు చివరికి నాశనం అయ్యారు. ఇదంతా చూస్తుంటే వైసీపీ ది తరాల రాజకీయం కాదు తలరాతలు మార్చేసే రాజకీయం అనడంలో ఎటువంటి సందేహం లేదు.






