కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదంగా స్వీకరించే తిరుమల లడ్డు విషయంలో జరిగిన అన్యాయాన్ని నిరవధికంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుండడంతో మీడియా వర్గాలలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా వినపడుతోంది.
అంతకుమించి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటిలో ఈ విషయంపై చర్చ జరుగుతుండడంతో, తిరుమల లడ్డు అంశం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ముడిపడిపోయింది. ఆ మాటకొస్తే ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో దాదాపు అయిదేళ్ళ పాటు జరిగిన ఈ అంశాన్ని జనాలు జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. ఈ వివాదంలో వైసీపీ వర్గాలు దోషులుగా నిరూపితం అయితే ఏపీలో వైసీపీకి ప్రజలు తిలోదకాలు ఇచ్చేసినట్లేనని ప్రముఖ రాజకీయ విజ్ఞులు మీడియాల వేదికలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, తనపై, తన పార్టీ వర్గాలపై వచ్చిన ఆరోపణలలో నిజం లేకపోతే జగన్ మోహన్ రెడ్డి ఇంత సైలెంట్ గా వ్యవహరించేవారా? అన్న ప్రశ్న కూడా పొలిటికల్ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొక్కుబడిగా పెట్టిన ప్రెస్ మీట్ మినహాయిస్తే, జగన్ నేరుగా మరోసారి స్పందించలేదు.
తన సొంత మీడియా సాక్షిలో చేయిస్తున్న కధనాలలో పస లేక, అది మళ్ళీ ‘బూమ్ రాంగ్’ అయ్యే పరిస్థితి. ఇక పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడకపోవడం వైసీపీకి మరీ మంచిది! చేసిన పాపం అష్టదిగ్బంధనంలా మారి జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్న జగన్ ను ఆ ‘దేవుడే’ రక్షించాలేమో!
ఈ అంశంలో ప్రతి ఒక్కరూ మాట్లాడిన విధానంపై స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రతిస్పందిస్తుండడంతో ఇప్పట్లో ఈ అంశం తెరమరుగయ్యే అవకాశం లేదు. ఏ స్థాయి వ్యక్తి అయినా తిరుమల లడ్డు అంశంలో వివాదంగా మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.




