అసెంబ్లీలో హంగామా చేసినా… మీడియా ముందు హడావుడి చేసినా… ఎక్కడైనా తన మార్క్ రాజకీయాలతో మీడియా వార్తల్లో ముందు వరుసలో ఉండడం వైసీపీ ఎమ్మెల్యేకు వెన్నతో పెట్టిన విద్య. సమయానుకూలంగా ఎలాంటి ప్రసంగాలనైనా సంధించగలదనే పేరు తెచ్చుకున్న రోజా, తాజాగా బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడారు. అవును…. చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో వైసీపీ నిర్వహిస్తున్న గ్రామీణ క్రికెట్ పోటీలను సందర్శించిన సందర్భంగా బ్యాట్ పట్టుకుని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
మైదానంలో క్రికెట్ ఆడుతున్న యువతరం బౌలింగ్ చేయగా, రోజమ్మ బ్యాట్ పట్టుకుని భారీ షాట్లను కొట్టి అలరించింది. ఎంతైనా నటీమణి కదా… భారీ షాట్లను కొడుతూ రోజా ప్రదర్శించిన హావభావాలు స్థానిక యువతను ఆకట్టుకున్నాయి. ఇక వెన్యూ ఏదైనా విమర్శలు చంద్రబాబు ప్రభుత్వం వైపుకే కాబట్టి… బ్యాట్ పట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ… క్రీడల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ అసలేమీ పట్టించుకోవడం లేదని విమర్శించడం మొదలు పెట్టారు.
రోజా మైక్ పట్టుకుంటే… ఎంత టైం పడుతుందో ఆమెకే తెలియదు కాబట్టి… క్రికెట్ ఆపేసి మరీ క్రీడాకారులు రోజా ప్రసంగాన్ని వినాల్సి వచ్చింది. అసలే వైసీపీ నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. చంద్రబాబు తన హయాంలో కనీసం ఒక్క క్రీడాకారుడినైనా తయారు చేశారా? యువత పక్క దారి పట్టకుండా… వారిని క్రీడలవైపు మళ్లించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని… రోజా ఉపన్యాసం అందుకోవడంతో… ‘ఇదేమి రాజకీయ గోల’ అంటూ నిట్టూర్పుని ప్రదర్శించడం క్రీడాకారుల వంతయ్యింది.
క్రీడల కోసం ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయని చంద్రబాబు… ఒలింపిక్స్ క్రీడలను నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పిన రోజా, వైసీపీ అధికారంలోకి రాగానే మాత్రం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ మూడేళ్ళల్లో క్రీడల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించని రోజా, బ్యాట్ పట్టుకోగానే… అదేదో సినిమాలో చెప్పినట్లుగా… టపీమని జ్ఞాన బల్బ్ వెలిగిపోయినట్లుగా స్పందించింది. రోజా బ్యాట్ పట్టుకుని క్రీడాకారులను ఉత్సాహపరచడం వరకు ఓకే గానీ, మైదానంలో కూడా రాజకీయాలు మాట్లాడి వైసీపీ ఉద్దేశం ఏమిటో క్రీడాకారులకు చాటిచెప్పారు.



