ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలోలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్ లోకి నీళ్ళు రావడం కలకలం రేపింది. నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఇలా జరగడం ఏంటో ప్రభుత్వానికి కూడా పాలుపోలేదు. మరో వైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జగన్ మీడియా అండ్ కో, వరుసగా కధనాలను ప్రసారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో పడ్డారు. అసలు విషయమేమీ లేకపోతేనే… ఎన్నో అవినీతి ఆరోపణల కధనాలను ప్రసారం చేసే జగన్ మీడియా, ఈ విషయంలో తమ టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు.
ఇక అసెంబ్లీ వద్ద ఏం జరిగిందోనన్న అసలు విషయం తేల్చాల్సిందిగా సీఐడికి బాధ్యతలు అప్పగించగా, ప్రాధమిక సమాచారం ప్రకారం… ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్న నిజం తేలింది. ఏసి పైప్ ను కట్ చేసి ఉండడం వలనే, దాని ద్వారా వర్షపు నీరు జగన్ చాంబర్ లోకి ప్రవేశించిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేసారు. పూర్తి విచారణ నిమిత్తం దీనిని సీఐడికి అప్పగించినట్లుగా తెలిపారు. వర్షం పడిన రోజు నిజానికి అక్కడ ఎలాంటి అధికారిక పనులు జరగలేదని తెలుస్తుండగా, కానీ కొంతమంది పనులు చేసినట్లుగా తెలియడంతో ఇందులో ఖచ్చితంగా, మరో యాంగిల్ ఉందన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
అయితే ఇది సాధారణంగా పరిగణించే అంశం కాదు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అసెంబ్లీలోకి ఓ చిన్నపాటి వర్షం వస్తేనే ఇంత జరిగిందంటే… ఇందుకు మూలం అయిన వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే… అన్న భావన ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో పంట పొలాలు తగలబడిపోయిన సమయంలో కూడా ప్రభుత్వం అసలు దోషులను పట్టుకోవడంలో విఫలమైంది. కొన్నాళ్ళ పాటు మీడియా హంగామా తర్వాత ఈ అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. ప్రభుత్వ పరంగా తమ వైపు తప్పు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందన్న భావనలు ప్రజలలో కలుగుతుండడంతో, ఇందులోనైనా అసలు దోషులను పట్టుకుని తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నది ఆకాంక్ష.



