“పిల్లిని ‘గోడకేసి కొడితే’ తిరగబడుతుంది. అలాంటిది పులిని తెచ్చి నాలుగు గోడల మద్య బందిస్తే? అంబటి రాంబాబుని మీరు పిల్లి అనుకొని పట్టుకొని జైల్లో బందించారు. ఆయన బయటకొస్తే మీరందరూ మటాష్,” అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సిఎం చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు.
ఇదివరకు హైదరాబాద్లో ఫార్ములా-1 రేసు జరిగినప్పుడు దానికి హాజరైన గుడివాడ అమర్నాథ్, కోడి-గుడ్డు ఫార్ములా కనిపెట్టి చాలా పాపులర్ అయ్యారు.
అలాగే ఇప్పుడు న్యూటన్ మూడో సూత్రాన్ని సవరించి కొత్తగా మరో సూత్రం రూపొందించారు. అదేమిటంటే, “రాజ్యాంగం ప్రకారం ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది,” అని చెప్పారు.
“అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినందుకు ఇప్పటికిప్పుడు మేమేమి చేయలేకపోయినా రేపు మేము అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా, డా.అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది,” అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
ఇంతకీ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతీకారం, ప్రతిచర్యలు ఏ పేజీలో ఉన్నాయో? కూడా అదే నోటితోనే చెప్పేస్తే అందరూ సంతోషించేవారు కదా?






