వైసీపి పాలనలో చిత్ర విచిత్రాలకు ఎన్నడూ కొదవలేదు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే ఆపసోపాలు పడుతున్న జగన్ ప్రభుత్వం, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం ఇంకా కష్టమని భావించి వారి పదవీకాలం మరో రెండేళ్ళు పొడిగించేసి ‘హమ్మయ్య’ అంటూ చేతులు దులుపుకుంది.
జగన్ ప్రభుత్వం ఓ పక్క ఉద్యోగుల పదవీ కాలం రెండేళ్ళు పొడిగిస్తే, మరోపక్క వైసీపి నేతలు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు! మరో 20-30 ఏళ్ళు మనమే అధికారంలో ఉండబోతున్నామని జగన్ చెప్తున్నా ఎవరూ ఆయన మాటలు నమ్మడం లేదు.
వైసీపిలో రకరకాల రిటైర్మెంట్స్ ఉన్నాయి.
జగన్ స్వయంగా మెడ పట్టుకొని బయటకు గెంటేసినవారు కొందరు. ఆయనతో వేగలేక బయటకు పోతున్నవారు మరికొందరు. ప్రభుత్వం, పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకునే పేర్ని నాని వంటి వారు మరికొందరు.
‘ఇవే మాకు చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయము కనుక ఈసారికి మాకు ఓట్లు వేసి పుణ్యం కట్టుకోండి,’ అని వేడుకునే కొడాలి నాని, మంత్రి ధర్మాన వంటివారు ఇంకొందరున్నారు. క్లుప్తంగా చెప్పుకుంటే వైసీపి ఖాళీ కాబోతోందన్న మాట!
మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం శ్రీకాకుళంలో ఓ కులసమావేశంలో మాట్లాడుతూ, “నాకు రాజకీయ విశ్రాంతి అవసరమనిపించి ఈసారి ఎన్నికలలో పోటీ చేయకూడదనుకున్నాను. ఈసారి మా అబ్బాయి రామ్మనోహర్ నాయుడిని పోటీ చేస్తాడని చెప్పాను. కానీ జగన్, మా అబ్బాయి ఇద్దరూ ఒప్పుకోలేదు. నాకు పదవీ వ్యామోహం లేదు. కష్టకాలం పార్టీకి అండగా నిలబడాలని పోటీ చేస్తున్నాను. అంతే! కానీ నేను పోటీ చేయడం ఇదే ఆఖరుసారి. కనుక అందరూ నాకు ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను,” అని అన్నారు.
మొదట సింహంలా గర్జించిన వారి అధినేత ఇప్పుడు ప్రతీ సభలో నేను ఒంటరినయ్యాను. కనుక మీ ఈ బిడ్డని మీరే కాపాడుకోవాలి అని ప్రాధేయపడుతుండగా, యధారాజా తధాప్రజా అన్నట్లు పేర్ని నాని, కొడాలి నాని, ధర్మాన తదితరులు ఈవిదంగా చెప్పుకొని ‘సానుభూతి ఓట్లు’ అడుక్కొంటున్నారు.
కొన్ని రోజుల క్రితం నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించినప్పుడు “చంద్రబాబు నాయుడుకి బదులు ఈసారి నేను కుప్పం నుంచి పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా?” అని స్థానికులను సరదాగా అడిగితే చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే కుప్పం నుంచి తన భార్యని పోటీ చేయించాలనుకుంటున్నారని, రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నారని వైసీపి నేతలు, వారి బాకా మీడియా చేసిన దుష్ప్రచారం అందరూ చూశారు.
కానీ చంద్రబాబు నాయుడు వారికి చెప్పుతో కొట్టిన్నట్లు టిడిపి, జనసేనల తొలిజాబితాలోనే తాను మళ్ళీ కుప్పంలో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
జగన్మోహన్ రెడ్డి ‘వైనాట్ 175?’ అంటూ గ్రాఫిక్ సభలు నిర్వహిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, తమ పార్టీ ‘కష్టకాలం’లో ఉందని సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అసలు విషయం బయటపెట్టేశారుగా!




