ఓ రాజకీయ పార్టీని నడపడమే చాలా చాలా కష్టం. అలాంటిది ఎన్నికలలో గెలిచి అధికారంలో రావాలంటే ఇంకా కష్టం. ఒకవేళ వచ్చిన తర్వాత ప్రజలలో ఎంతో కొంత మంచి పేరు సంపాదించుకొని దిగిపోయినా పర్వాలేదు. కానీ చేజేతులా పేరు చెడగొట్టుకొని దిగిపోతే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన చేసినా ప్రయోజనం ఉండదు.
ఉదాహరణకు రాష్ట్ర విభజన చేయవద్దనే ఏపీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (యూపీయే ప్రభుత్వం) చేసింది. అందువల్ల ప్రజలు దానిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేశారు. నేటికీ అది కోలుకోలేకపోతోంది.
వైసీపీకి కూడా ప్రజలు అలాగే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మొదటిసారే చాలా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కనుక ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయమైనా తీసుకోవచ్చు… అమలుచేయవచ్చు.
కనుక అది ఎవరూ ఊహించని విదంగా మూడు రాజధానులు ప్రతిపాదన చేసింది. కానీ చివరికి ఒక్క (విశాఖ) రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. వైసీపీ ప్రభుత్వానికి అంత భారీ మెజార్టీ ఉన్నా స్వయంగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని అమలు చేయలేకపోవడం వైఫల్యమే కదా?
ఒకవేళ అధికారంలోకి రాగానే విశాఖని అభివృద్ధి చేసి రాజధానిగా మార్చి ఉండి ఉంటే, అది అమరావతి కంటే మంచి నిర్ణయమే అని వైసీపీ చెప్పుకోగలిగేది. ప్రజలు కూడా అవునో కాదో ఆలోచింఛి తమ నిర్ణయం ఓట్ల రూపంలో తెలియజేసే ఉండేవారు.
ఒకవేళ అలా జరిగి ఉండి ఉంటే వైసీపీని ప్రజలు తిరస్కరించినా ఎన్నికలలో కనీసం 40-50 సీట్లు ఇచ్చి ఉండేవారు. కానీ వైసీపీ ఆ అవకాశం కూడా పోగొట్టుకొంది…. తన నిర్ణయాన్ని అమలుచేసే ధైర్యం లేకనే!
రాజధాని విషయంలో వైఫల్యం చెందినా ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకి జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నేడు ఏపీ పరిస్థితి, వైసీపీ పరిస్థితి వేరేలా ఉండేవి.
కానీ ప్రజల ఆకాంక్షలు అర్ధం చేసుకొనే బదులు తమ ఆలోచనలు, రాజకీయ అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పధకాలతో వైసీపీకి తిరుగులేని ఓటు బ్యాంక్ నిర్మించుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నమూ బెడిసికొట్టింది.
నిజానికి వైసీపీకి లభించిన 11 సీట్లు కూడా దాని విధానాలు నచ్చి ఇచ్చినవి కానే కావు. ఆ 11 మంది తమ సొంత బలంతో గెలుచుకున్నవే అవి. కనుక వైసీపీ ఓటమి సంపూర్ణం అనుకోవచ్చు.
తమ ఓటమికి కారణాలు విశ్లేషించుకొని తెలుసుకొని రాజకీయ అజ్ఞానంలో వైసీపీ లేదు. కానీ అది కూడా వద్దనుకుని తమ ఓటమికి దోహదపడిన పాత మాటలు, పాత ఆలోచనలు, పాత విధానాలతోనే ముందుకు సాగుతోంది. అది దానిష్టం. ఎందుకంటే దాని పర్యవసానాలు అదే అనుభవించాల్సి ఉంటుంది కనుక.
కానీ ‘మళ్ళీ మేమే తప్పకుండా అధికారంలోకి వస్తామనే’ ఒక భావన ప్రజలకు కలిగించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు, అందుకు అది ఎంచుకుంటున్న విధానాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవల జగన్ ‘డిజిటల్ బుక్’ లాంచ్ చేయడమే ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
ఈ వ్యూహాన్ని కూటమి ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేస్తోంది. ‘అమరావతి, పోలవరం నిర్మించి, ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధి చేస్తున్నాము… పైగా ఇప్పుడు కొసరుగా సంక్షేమ పధకాలు కూడా అమలుచేస్తున్నాము. కనుక వైసీపీ ఇక ఎన్నటికీ అధికారంలోకి రాలేదు,’ అనే గుడ్డి నమ్మకం లేదా భ్రమలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లనిపిస్తుంది.
కానీ వైసీపీ చేస్తున్న ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందని గ్రహిస్తే మంచిది.






