ఒక అబద్దాని వంద మంది వందసార్లు గట్టిగా నొక్కి చెపితే అది నిజమైపోతుందనే ఫార్ములాని వైసీపి నేతలందరూ బాగా వంటపట్టించుకున్నారు. కరకట్టపై సిఎం చంద్రబాబు నాయుడు నివాసాన్ని కాపాడటానికే బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడలో లక్షల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని జగన్ చేసిన ఆరోపణలపై విజయవాడ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి మేధావులు సైతం జగన్ చేసిన ఈ ఆరోపణని తప్పు పట్టారు. ఒకవేళ బుడమేరు నీటి ప్రవాహాన్ని కిందకు వదలకుండా అడ్డుకుంటే ఎగువన ఉన్న గ్రామాలు, ఎన్టీపీసీ అన్నీ మునిగిపోతాయి కదా? కృష్ణానది అంత ఉదృతంగా పారుతున్నప్పుడు బుడమేరు ప్రవాహాన్ని ఎలా తీసుకుంటుంది?
అయినా 11.43 లక్షల క్యూసెక్కుల కృష్ణా నదిలో 30-40 వేల క్యూసెక్కులు ఏపాటి? ఒకవేళ తీసుకున్నా ఆ నీళ్ళ వలన కరకట్ట మీద చంద్రబాబు నాయుడు నివాసం మునిగిపోతుందా?అని ప్రశ్నల వర్షం కురిపించారు ప్రొఫెసర్ నాగేశ్వర్.
బుడమేరుకి గండ్లు పడటం వలననే విజయవాడలోకి నీళ్ళు ప్రవహిస్తున్నాయని తెలిసి కూడా జగన్ ఇటువంటి ఆరోపణలుచేస్తుండటం ఆయన నీచరాజకీయాలకు పరాకాష్ట అని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరుకి కుడి, ఎడమవైపు సుమారు 7-8 చోట్ల భారీ గండ్లు పడ్డాయి. వాటిలో కొన్నిటిని మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పూడ్పించగా, వాటిలో అతిపెద్ద గండిని ఆర్మీ ఇంజనీర్లు, సిబ్బంది సాయంతో నేడు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే జగన్కి ఈ బుడమేరు ఐడియా ఎవరు చెప్పారో కానీ జనాలు నవ్వుతున్నారనే స్పృహ కూడా లేకుండా వైసీపిలో అందరూ గుడ్డిగా ఇదే పాట పాడుతున్నారు.
తాజాగా వైసీపి రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలులో ఇదే పాట పాడుతూ చంద్రబాబు నాయుడు స్వార్ధం, చాతకానితనం వల్లనే విజయవాడ ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయని ఆరోపించారు.
కానీ వైసీపి నేతలు ఈ దుష్ప్రచారం ఇలాగే కొనసాగిస్తూ ప్రజలను నమ్మించాలనుకోవడం మూర్ఖత్వం కాదా? ఒకవేళ వారి వాదనలు నిజమే అయితే, వైవీ సుబ్బారెడ్డితో సహా వైసీపి నేతలందరూ విజయవాడలో, బుడమేరు ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు చెప్పవచ్చు కదా?చెపితే అప్పుడు ప్రజలే తమకి గడ్డి పెడతారని వారికి కూడా తెలుసు. అందుకే జగన్ వెంట ఏ ఒక్క సీనియర్ నాయకుడు కనిపించడం లేదు.




