కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్‌.. తర్వాత మామూలే!

14 Days Remand For Kommineni Srinivasa Rao

సాక్షి ఆస్థాన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకి మంగళగిరి కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు ఆయనని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఇటీవల సాక్షి న్యూస్ ఛానల్లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని ఆయన వారించకపోగా మరింత తప్పుగా మాట్లాడేలా ప్రోత్సహించారు.

అందుకు తుళ్ళూరు పోలీసులు ఆయనతో సహా కృష్ణంరాజు, సాక్షి మీడియా కేసులు నమోదు చేశారు. ఆ కేసులోనే కొమ్మినేని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. పరారీలో ఉన్న కృష్ణంరాజు కొరకు పోలీసులు గాలిస్తున్నారు.

ADVERTISEMENT

కొమ్మినేని వంటి సీనియర్ జర్నలిస్ట్ జీవితంలో ఇటువంటి పరిస్థితి దాపురిస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన వైసీపీ సొంత మీడియాలో చేరారో అప్పుడే ఆయన జాతకచక్రం తయారైపోయిందని భావించవచ్చు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరితో పాటు కొమ్మినేని కూడా రాజయోగం అనుభవించారు. ఇప్పుడు అందరితో పాటు జైలు యోగం అనుభవిస్తున్నారని సర్దిచెప్పుకోక తప్పదు.

కానీ జగన్‌ కళ్ళలో ఆనందం చూడాలనో లేదా అమరావతి గురించి ఎవరికీ తట్టని పాయింట్ కనిపెట్టి మాట్లాడి జగన్‌ మెప్పు పొందాలనే తాపత్రయమే నేడు ఆయన గుంటూరు జైలులో ఊచలు లెక్కబెట్టేలా చేసిందని చెప్పక తప్పదు. అయితే కొమ్మినేని ఎపిసోడ్ జైలు వరకు వచ్చేసింది కనుక తర్వాత కస్టడీ, జగన్‌ పరామర్శ, బెయిల్‌ పిటిషన్‌ వగైరా షరా మామూలే!

సజ్జన సాంగత్యం.. దుర్జన సాంగత్యం అంటారు పెద్దలు. సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయారని అనుకోవాలా?

ADVERTISEMENT
Latest Stories