Air India Flight Crash in Ahmedabad

అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈరోజు మద్యాహ్నం 1.17 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-ఏ డ్రీమ్ లైనర్ (ఫ్లైట్ నంబర్: ఏఐ 171) విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రన్ వే అవతల ఉన్న బిజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌పై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి.

విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు. విమానం కూలిపోయినప్పుడు వైద్య కళాశాల హాస్టల్లో వైద్య విద్యార్ధులు భోజనాలు చేస్తున్నారు. మొత్తం వంద మంది చనిపోయినట్లు సమాచారం కానీ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

విమానాశ్రయం బయటే ఈ ప్రమాదం జరగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు, వైద్య బృందాలు అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ చెట్టుని ఢీకొట్టి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. అంటే నిర్ధిష్ట సమయంలో నిర్ధిష్టమైన ఎత్తుకు ఎగరలేకపోవడం వలన ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు.

Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..


ఈ విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇంకా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.