నవంబర్ 8వ తేదీన ప్రధాని చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయారు నరేంద్ర మోడీ. అప్పటినుండి ఇప్పటివరకు మోడీ ఏం వ్యాఖ్యలు చేసినా సామాన్య ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. నిజానికి రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు మాత్రమే ప్రధాని వ్యాఖ్యలు ఎక్కువగా పరిమితమవుతుంటాయి. కానీ, పాత నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని ప్రతి పౌరుడు మోడీ ఏం చేయబోతున్నారా? అనే దానిపై నిరీక్షిస్తున్నారు.
మోడీ చెప్పిన 50 రోజుల గడువు తీరింది. కానీ, బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్యుల కష్టాలు తీరలేదు. మరో వైపు నగదు రహిత లావాదేవీలు చేద్దామని ప్రజలు భావించినా గానీ, స్వైపింగ్ యంత్రాలు అందుబాటులో లేని పరిస్థితి. దీంతో మోడీ తదుపరి ప్రసంగం ఎవరిని టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది? నల్లకుభేరుల కోసం వేసిన మంత్రం, సామాన్యుల పైకి రావడంతో తదుపరి అస్త్రాన్ని అయినా సరిగ్గా నల్లకుభేరుల పైకి వదులుతారా? లేక మళ్ళీ సామాన్యులనే బలిపశువులను చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
వీటన్నింటికి తెరదించబోయే సమయం ఆసన్నమవుతోంది. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 7.30 నిముషాలకు మోడీ తన సరికొత్త బాణాలను వదలడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కొత్త సంవత్సరం మరికొద్ది గంటల్లో రాబోతుందన్న తరుణంలో… మోడీ ఎలాంటి ‘బాంబులు’ పేలుస్తారోనని ఓ పక్కన నల్లకుభేరులు, బినామీలు కూడా గజగజ వణికిపోతున్నారు. కరెన్సీ రద్దుతో ఇబ్బందులు పడిన సామాన్యులు, తదుపరి చర్యలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొవడానికి సిద్ధంగా లేరన్నది అయితే వాస్తవం.



