దేనికైనా తొలి అడుగు అవసరమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ సృష్టించిన అనేక సమస్యలు స్వాగతం పలుకుతుండగా, సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే చాలా నిబ్బరంగా తొలి అడుగు వేసి ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.
ఈ ఏడాదిలో సగం సమయం జగన్ సృష్టించిన సమస్యలని పరిష్కరించడానికే సరిపోయింది. లేకుంటే తొలి ఏడాదిలోనే చాలా పనులు జరిగి ఉండేవి! నేటికీ జగన్ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. ఓ పక్క వాటిని ఎదుర్కొంటూనే సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
అయితే వైసీపీ కుట్రలను ఛేదించడానికి ఆయన ఒక్కరి ప్రయత్నాలే సరిపోవు. కూటమిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల నేతలు అందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవాలి.
అందుకే సిఎం చంద్రబాబు నాయుడు ఇంటింటికీ ‘తొలి అడుగు’ అనే కొత్త కార్యక్రమం ప్రకటించారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో కూటమిలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తి చేసిన పనులు, అమలు చేసిన సంక్షేమ పధకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు, సాధించిన పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ప్రజలకు వివరించాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
తద్వారా జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని సూచించారు. చేసిన, ఇంకా చేస్తున్న పనుల గురించి చెప్పుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తే, జగన్ దుష్ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లవుతుందని సిఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
సిఎం చంద్రబాబు నాయుడు చెప్పింది అక్షరాల నిజమని వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చూస్తే అర్దమవుతుంది.
సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజల ఇళ్ళకు వెళ్ళి వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు కనుగొంటునందుకు ప్రజలలో ఆయన పట్ల ప్రేమాభిమానాలు, గౌరవం చాలా పెరిగింది. ఆయన పేరు ప్రతిష్టలు పెరిగితే టీడీపీకి లబ్ధి కలుగుతుందని వేరే చెప్పక్కరలేదు.
అలాగే కూటమి నేతల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, నిమ్మగడ్డ రామానాయుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నేత కిమిడి నాగార్జున వంటి పలువురు నిత్యం ప్రజలతో మమేకం అవుతూ అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ‘నేను బటన్ నొక్కుతా’ మీరు ‘గడప గడపకు’ వెళ్ళమని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంతగా చెప్పినా వెళ్ళకుండా అలసత్వం ప్రదర్శించారు. వెళ్ళి ప్రజలతో సత్సంబందాలు ఏర్పరచుకొని ఉంటే వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోయేది కాదు కదా?
అప్పట్లో వారి ఆరాచకాలు, అవినీతి, జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా వారు ప్రజల వద్దకు వెళ్ళేందుకు భయపడి ఉండవచ్చు.
కానీ ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సంక్షేమ పధకాలు కూడా అమలవుతున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురి పట్ల ప్రజలలో సదాభిప్రాయమే ఉంది.
కనుక కూటమి నేతలు కూడా ఇంటింటికీ ‘తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలలో తమకి అటువంటి గౌరవ మర్యాదలు సంపాదించుకునే ప్రయత్నం చేయడం వారికి, కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది. చాలా అవసరం కూడా.




