జగన్ అమరావతిని రాజధానిగా వద్దనుకున్నారు. కానీ అయన పుణ్యమాని ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత లభించబోతోంది!
ఒకవేళ జగన్ కూడా మాట, మడమ తిప్పకుండా అమరావతిని రాజధానిగా అంగీకరించి, దాని నిర్మాణ పనులు కొనసాగించి ఉండి ఉంటే నేడు ఈ అవసరమే ఉండేది కాదు. కానీ కాదని విశాఖ రాజధాని అన్నారు. కనుక అమరావతికి చట్ట బద్దత అవసరమని సిఎం చంద్రబాబు నాయుడు గ్రహించారు. మళ్ళీ భవిష్యత్తులో జగన్ లేదా అలాంటి ఆలోచనలు చేసేవారు అధికారంలోకి వస్తే, వారికి రాజధాని మార్చే అవకాశం ఉండకూడదు. కనుక కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ చేతనే ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేయిస్తున్నారిప్పుడు.
ఇటీవల కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. దానికి మొదట కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, తర్వాత పార్లమెంటులో ఆమోదముద్ర వేయడం లాంచన ప్రాయమే.
తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.
కనుక ఇక ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్కి అమరావతే రాజధానిగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రాజధాని మార్చాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు తప్పవు.
నాడు టీడీపి, జనసేన చేతులు కలపకూడదనుకున్నారు జగన్. వాటిని కలవకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి ఆయనే వాటిని కలిపారు.
అదేవిధంగా అమరావతి వద్దంటే వద్దనుకున్నారు. కానీ 5 ఏళ్ళు అక్కడే చంద్రబాబు నాయుడు కట్టించిన భవనాలలోనే కూర్చొని పాలన సాగించాల్సి వచ్చింది. ఇప్పుడు అయన నిర్వాకం వల్లనే అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ముద్ర పడబోతోంది.
కనుక దీనిలో చంద్రబాబు నాయుడు పట్టుదల, ప్రయత్నం ఎంత ఉన్నాయో, జగన్ నిర్వాకం కూడా అంతే ఉంది. కనుక ఈ క్రెడిట్ ఇద్దరికీ సమానంగా దక్కుతుంది.






