ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అంశాలలో ఒకటి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలు. రాజధాని అభివృద్ధి ప్రామాణికంగా ఏపీలో భవిష్యత్ రాజకీయం జరగబోతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
గత వైసీపీ ప్రభుత్వ పాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎన్నటికీ మరిచిపోలేదు. ఆ చేదు జ్ఞాపకాలే కూటమి ప్రభుత్వానికి కొండంత అండగా కాపు కాసే అవకాశం ఉంటుంది. కూటమి రాకతో అరణ్యంగా మారిన అమరావతి అభివృద్ధితో పరుగులు పెడుతుంది.
అలాగే రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ కేంద్రం రాజధాని విషయంలో చట్టబద్దత కల్పించనున్న నేపథ్యంలో వైసీపీ కి మరోసారి ఈ మూడు ముక్కలాట ఆడే అవకాశము లభించదు. కాబట్టి రేపటి రోజున వైసీపీ మనసు మార్చుకుని మూడు రాజధానులు అంటూ విశాఖను ముందుపెట్టినా, లేదా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అంటూ వెనక్కి తగ్గినా వాటిని విశ్వసించేందుకు ఏపీ సమాజం ముందుకు రాదు.
కాబట్టి అమరావతి అభివృద్ధి అనేది కూటమి 2.0 ఆశలను సజీవంగా నిలపగలదు. కూటమి ప్రభుత్వం తమకు మిగిలి ఉన్న ఈ నిర్ణీత సమయంలో మాట ఇచ్చిన ప్రకారం అమరావతి నిర్మాణాలను ఒక నిర్దిష్ట రూపం ఇచ్చి వాటిని ప్రజల ముందుకు తీసుకురాగలిగితే, అలాగే రాజధానికి మౌలిక వసతుల కల్పన సౌకర్యాలు అందుబాటులోకి తేగలిగితే వైసీపీ 2. 0 ఆశలు ఆవిరయినట్టే .
మరి తెలంగాణలో కాంగ్రెస్ కి ఈ రకమైన భరోసా అందించే అంశం ఏదైనా ఉందా అంటే ఇప్పటికి కాంగ్రెస్ దగ్గర అందుకు సరైన సమాధానం లేదు. కాంగ్రెస్ రాకపోతే తెలంగాణ పరిస్థితేమిటి.? హైద్రాబాద్ ప్రగతి ఎలా అనేది తెలంగాణ రాజకీయాలలో ఎప్పటికి చర్చనీయాంశం కాదు కాజాలదు.
ఎందుకంటే వైసీపీ లాంటి రాజకీయ పార్టీ కానీ జగన్ లాంటి రాజకీయ నాయకుడు కానీ తెలంగాణ రాజకీయాలలో కనిపించరు. ప్రత్యర్థి పార్టీల మీద ఉండే రాజకీయ ద్వేషాలను, ఆయా పార్టీల నాయకుల మీద ఉండే విద్వేషాలను రాష్ట్ర ప్రగతి పై, రాష్ట్ర భవిష్యత్ పై చూపించేంత సంకుచిత మనస్తత్వం ఉన్న నేతలు ప్రస్తుతానికి తెలంగాణలో లేరనే చెప్పాలి.
నాడు బాబు వేసిన ఐటీ పునాదులను ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులందరు కొనసాగించారు, అలాగే బాబుతో పోటీ మరి హైద్రాబాద్ – సికింద్రాబాద్ నగరాలను అభివృద్ధి పథంలో నడిపించారు. అందు నాటి వైఎస్ఆర్ నుంచి నిన్న కేసీఆర్, నేటి రేవంత్ వరకు ప్రత్యక్ష ఉదాహరణలు.
కానీ ఏపీలో ఇందుకు పూర్తి భిన్నంగా అమరావతి నిర్మాణం బాబు విజనరీకి, టీడీపీ విజన్ కి ప్రామాణికం కానుంది అనే ఒకేఒక్క రాజకీయ అసూయతో కొన్ని కోట్ల ప్రజల ఆకాంక్షలను ని, ఒక రాష్ట్ర భవిష్యత్ ని వైసీపీ పేరుతో జగన్ మూడుముక్కలాట చేసారు.






