వాక్చాతుర్యం వేరు భాషపై పట్టు వేరు. ఉదాహరణకి కేసీఆర్, కేటీఆర్, కవిత, యాంకర్ సుమ, ప్రముఖ ప్రవచకారులు చాగంటి, గరికపాటి వంటి పలువురు మంచి వాక్చాతుర్యం ఉన్నవారు. వారు అప్పటికప్పుడు అందరినీ మెప్పించేలా మాట్లాడగలరు. వారందరికీ భాషపై కూడా మంచి పట్టుంది. కనుక వారు ఏం మాట్లాడినా వినసొంపుగానే ఉంటుంది.
కానీ భాషపై మంచి పట్టున్న చాలా మంది తమకు వాక్చాతుర్యం కూడా ఉందనుకుంటారు. అలాంటివారిలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కొడాలి నాని, రోజా వంటివారున్నారు.
వీరందరూ తమ అధినేత జగన్ కంటే చాలా చక్కగా అచ్చమైన తెలుగులో ఏమాత్రం తడబడకుండా… ముఖ్యంగా కాగితం చూడకుండా అనర్గళంగా మాట్లాడగలరు. బూతులు కూడా తిట్టగలరు. వారు నోరు విప్పితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు.
కానీ తాము చాలా తెలివిగా మాట్లాడుతూ తో ప్రజలను మెప్పిస్తున్నామని అనుకుంటారు. కానీ తమ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని గ్రహించరు. వారికి ఆ అవసరంలేదు కూడా.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకొని జగన్ కడపలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి, “ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో మీకందరికీ తెలుసు కదా? అని ప్రశ్నించారు. పరామర్శ యాత్రలో “మా కుర్రాళ్ళు ఏదో ముచ్చటపడి రప్పా రప్పా తలకాయలు నరుకుతామంటే తప్పేమిటి?” అని ప్రశ్నించారు. “పరకామణిలో 9 డాలర్లు దొంగతనం చేస్తే అది పెద్ద తప్పా?” అని ప్రశ్నించారు. ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలే కదా?
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా?
కనుక వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా ‘పరకామణిలో చేతివాటం పెద్ద తప్పు కాదని మా అధినేత జగన్ అంటే దానిలో తప్పేమిటి? అది చిన్న తప్పేగా?” అని ప్రశ్నించారు.
అలాగే చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీషులో మాట్లాడటం రాదంటూ “నాలాగే చంద్రబాబు నాయుడుకి కూడా పొట్టకొస్తే ఒక్క ఇంగ్లీషు ముక్క రాదు. కనుక ఢిల్లీలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు,” అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
జర్మనీ, జపాన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి అనేక దేశాధినేతలకు ఇంగ్లీషు రాదు. వచ్చినా మాట్లాడటానికి ఇష్టపడరు. వారు ఎక్కడికి వెళ్ళినా తమ భాషలోనే మాట్లాడుతారు. కానీ ఎవరూ వారిని తక్కువ చేసి చూడరు. ఇంగ్లీషు రాదని ఎవరూ విమర్శించరు. కానీ చంద్రబాబు నాయుడు ఇంగ్లీషులో మాట్లాడలేకపోతే పేర్ని నానికి నవ్వొస్తుంది! ఎద్దేవా చేస్తారు.
అదే… తమ అధినేత జగన్కి కాగితం మీద వ్రాసిచ్చినా చూసి తెలుగులో చదవడానికి తడబడితే పేర్నికి, అంబటి రాంబాబుకి నవ్వు రాదు. నవ్వితే జీవితంలో మరెన్నడూ నవ్వలేరు కూడా!
ఇంత చెప్పుకొని అంబటి పాండిత్యం గురించి నాలుగు ముక్కలు చెప్పుకోకపోతే ఆయనని ఘోరంగా కించపరిచినట్లే లెక్క!
పోలవరం అంటే డయాఫ్రం వాల్వ్ మాత్రమే అన్నట్లు ఆ వాల్వ్ తిప్పుతూ ఆయన మాట్లాడిన మాటలు ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు.
“నా ఖర్మ కాకపోతే ఏపీకి అంతర్జాతీయ స్థాయి రాజధాని దేనికయ్యా?” అంటూ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
తాజాగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కుటుంబం, తండ్రి, మతం, కమ్యూనిజం అంటూ అంబటి రాంబాబు దుమ్ము దులిపేశారు. ఆ మాటలను మాటలతో వివరించడం మాటలు కాదు. అదేదో ఎవరి చెవులతో వారే వింటే వినసొంపుగా ఉంటుంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు తమ అధినేత పవన్ కళ్యాణ్ గురించి అంబటి రాంబాబు చెప్పిన ఈ నాలుగు ముక్కలు తప్పక వినాలి.




