రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళు ఏకధాటిగా అరాచక పాలన సాగిన తర్వాత మళ్ళీ ఎవరైనా రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెడతారా?
మళ్ళీ అరాచక పాలన తప్పదని, ఈసారి అది ఇంకా భయానకంగా ఉంటుందని వైసీపీ పదేపదే హెచ్చరిస్తున్నప్పుడు ఎవరైనా పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తారా? అంటే కాదనే చెప్తారు ఎవరైనా.
కానీ సాహసిస్తున్నారంటే అందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1. సిఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న గుడ్విల్, 2. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటం, 3. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు, 4. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, 5. ఈ కారణంగా ఏపీలో వైసీపీ మళ్ళీ రాదని పెట్టుబడుదారులకు కూడా నమ్మకం కలగడం, 6. ప్రభుత్వం ఇస్తున్న భారీ రాయితీలు, 7. దేశంలో ఐటి కంపెనీల విస్తరణకు మరో కొత్త డెస్టినేషన్ అవసరం ఉండటం, 8. విశాఖపట్నం అందుకు అన్ని విధాల తగినదిగా భావిస్తుండటం, 9. మంత్రి నారా లోకేష్ కృషి, చొరవ, అందిస్తున్న సహాయసహకారాలు.
ఒకప్పుడు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడుదారులు మొహం చాటేయడానికి ఎన్ని కారణాలు కనిపిస్తున్నాయో, ఇప్పుడు ఏపీకి వచ్చేందుకు ఇలా పలు కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన, జగన్ విధ్వంస పాలనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవి చాలా ఉపశమనం కలిగిస్తున్నాయి.
అయితే కూటమి ప్రభుత్వం పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తుంటే ఓ పక్క వాటి గురించి దుష్ప్రచారం చేస్తూనే అవన్నీ గతంలో మేము తెచ్చినవే అని వైసీపీ చెప్పుకోవడం దాని ద్వంద ప్రమాణాలకు చక్కటి ఉదాహారణగా చెప్పుకోవచ్చు.
ఏపీకి లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే అవన్నీ ప్రజలను మభ్య పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలే అని వైసీపీ వాదిస్తుంటుంది. దానికి చెంపదెబ్బ కొట్టినట్లు సిఎం చంద్రబాబు నాయుడు నేడు ఒకేసారి 9 కంపెనీలకు భూమిపూజ చేయనున్నారు.
వీటన్నిటికీ భూములు కేటాయించి రాయితీలు ఇస్తున్నప్పుడే నిర్దిష్ట గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ముందే షరతులు విధించింది. కనుక కంపెనీ స్థాయిని బట్టి 12-24 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేసుకొని కార్యకలాపాలు మొదలుపెట్టబోతున్నాయి. అంటే జస్ట్ ఎంవోయులు కాదు… శంకుస్థాపనలు.. తర్వాత నిర్మాణ పనులు, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయన్న మాట! లేకుంటే అప్పుడు ఎలాగూ వైసీపీ నిలదీస్తుంది.
ఈరోజు భూమిపూజ జరుగుతున్న కంపెనీలు ఇవే: కాగ్నిజెంట్, సత్వా గ్రూప్, ఫ్లూయెంట్ గ్రిడ్, ఇమ్మా జిన్నోవేట్, క్వార్క్స్ టెక్నాలజీస్, మదర్సన్ టెక్నాలజీ, టెక్ తమ్మిన, నాన్రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ హెల్త్ కేర్.
వీటన్నిటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 70 ఎకరాలు కేటాయించగా అవి రూ.3,740.33కోట్లు పెట్టుబడితో కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి.






