ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలంటే ఎవరైనా ఏం మాట్లాడుకుంటారు? అజెండా, దానిలో బిల్లులు, చర్చలు, అధికార, ప్రతిపక్షాల వ్యూహాల గురించే కదా?
కానీ ఏ దేవుడి పూజ చేసిన ముందుగా వినాయకుడి పూజతో మొదలుపెట్టాలన్నట్లు, శాసనసభ సమావేశాలంటే ముందుగా వైసీపీ అధినేత జగన్కి ‘ప్రధాన ప్రతిపక్ష హోదా’ ఇవ్వకపోవడం గురించే చెప్పుకున్న తర్వాతే ఏదైనా.
కూటమి ప్రభుత్వానికి 11 సెంటిమెంట్ బాగా అచ్చివచ్చినట్లుంది. అందుకే ప్రతీసారి 11వ తేదీనే సమావేశాలు ప్రారంభిస్తోంది. ఈసారి కూడా రేపు 11వ తేదీ నుంచే శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. సాధారణంగా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవ్వాలి.
కానీ ఆనవాయితీ ప్రకారం జగన్కి ‘ప్రధాన ప్రతిపక్ష హోదా’ ఎందుకు ఇవ్వడం లేదో ఆయనతో పాటు వైసీపీ నేతలందరూ తలో మాట మాట్లాడిన తర్వాతే సమావేశాలు మొదలవుతాయి.
ఆయన ప్రియ శత్రువులు స్పీకర్, డిప్య్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణరాజు ఇద్దరూ కూడా ప్రతీసారి ‘హాజరు’ వేయించుకోవాలని మరిచిపోకుండా గుర్తు చేస్తూనే ఉంటారు. కనుక 11 మందితో కూడిన జగన్ టీమ్ రేపు తప్పక శాసనసభకు వస్తారు. హాజరు వేసుకొని వెళ్తారు.
రేపు ఉదయం 10.30 గంటలకి గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తర్వాత బీఏసీ సమావేశంలో అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇవి బడ్జెట్ సమావేశాలు కనుక సుమారు 20 రోజులు సాగే అవకాశం ఉంది.
క్రికెట్ మ్యాచ్ స్టేడియంలోను చూడవచ్చు. ఇంట్లో టీవీలో రీప్లేలు, కామెంటరీ సహా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నని రోజులు తాడేపల్లి ప్యాలస్ నుంచి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కామెంటరీ, విశ్లేషణ ప్రసారం అవుతూనే ఉంటుంది.






