ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు చకచకా నిర్మాణం అవుతున్నాయి కానీ 10-12 ఏళ్ళ క్రితం చేసిన విశాఖ, విజయవాడ మెట్రో ప్రతిపాదనలు మాత్రం ముందుకు సాగడం లేదు.
కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వీటిని వచ్చే ఎన్నికలలోగా నిర్మించాలనుకుంది. గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ మెట్రో ప్రతిపాదనలు మూడడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లే సాగుతుండటంతో రెండు నగరాలలో ఇంతవరకు భూమిపూజ కూడా చేయలేని దుస్థితి.
తాజాగా ‘డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు’ నిర్మాణ ప్రతిపాదనలు నిరుపయోగమైనవని, కేవలం మెట్రో కారిడార్ ఒక్కటే నిర్మిస్తే సరిపోతుందని తేల్చి చెప్పింది. కనుక కేవలం మెట్రో కారిడార్ నిర్మాణానికి మాత్రమే ప్రతిపాదనలు పంపించమని సూచించింది.
రెండు నగరాలలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయినప్పటికీ ఈ డబుల్ డెక్కర్ ప్రతిపాదన వల్లనే ప్రభుత్వం ఫ్లై ఓవర్లు నిర్మించకుండా ఎదురుచూస్తూ సుమారు రెండేళ్ళ విలువైన సమయం వృధా చేసుకుంది.
ఇప్పుడు కేవలం మెట్రో కారిడార్ నిర్మాణానికి మళ్ళీ సర్వే చేసే బాధ్యతను రైట్స్ సంస్థకు అప్పగించింది. రెండు నెలల్లో నివేదిక తయారు చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
విజయవాడ బస్టాండ్ నుంచి మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే, కాళేశ్వరం మార్కెట్ వరకు దానిని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కొత్త నివేదిక సమర్పించాలని రైట్స్ సంస్థని ఆదేశించింది.
దీంతో మరికొన్ని సమస్యలు ఏర్పడుతాయి. ఈ అనుమతులు, భూమిపూజ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. అంటే ఈ ఏడాది డిసెంబర్లోగా లేదా 2027లో పనులు మొదలవ్వవచ్చు.
1. 2029 ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ జమిలి ఎన్నికలైతే కాస్త అటూఇటూగా జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది.
2. ఒకవేళ మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తే పర్వాలేదు. కానీ జగన్ అధికారంలోకి వస్తే మెట్రో పనులు ఎక్కడివక్కడ నిలిపివేయక మానరు. కనుక ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు రెండు నగరాలలో మెట్రో నిర్మాణ పనులు మొదలుపెడితే తప్పనిసరిగా ఏడాదిన్నరలోగా పూర్తి చేసి మెట్రో రైళ్ళు ప్రారంభోత్సవం కూడా చేసి తీరాలి. లేకుంటే మొదలుపెట్టకపోవడమే మంచిది.
3. ప్రస్తుతం ఉన్న రోడ్లు వాహనాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒకవేళ మెట్రో పిల్లర్లు వేసి పనులు నిలిపివేస్తే నగర ప్రజలకు ఇక రోజూ నరకమే. ఒకవేళ మరో 5 ఏళ్ళు నిర్మాణ పనులు సాగినా నగరవాసులకు కష్టమే.
4. మారో సమస్య మెట్రో వేరేగా ఫ్లై ఓవర్లు వేరేగా నిర్మించాల్సి వస్తే, వేర్వేరుగా భూసేకరణ చేయాలి. వేర్వేరుగా నిర్మాణాలు చేపట్టాలి. కనుక ఖర్చు రెండింతలు పెరుగుతుంది.
5. మెట్రో పిల్లర్లు వేసిన తర్వాత ఫ్లై ఓవర్లకు వేరేగా భూసేకరణ చేయడం, స్థలం సర్దుబాటు చేయడం కూడా కష్టమే. కనుక మెట్రో కథ మళ్ళీ మొదటికొచ్చినట్లే భావించవచ్చు.
కనుక ప్రభుత్వం మెట్రో కోసం ఆరాటం, వృధా ప్రయాస మానుకొని, మెట్రో బదులు విశాలమైన ఫ్లై ఓవర్లు నిర్మిస్తే తొందరగా పూర్తవుతుంది. ప్రజలూ సంతోషిస్తారు కదా?




