ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరిశ్రమలు, పెట్టుబడుల కోసం నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తెలంగాణకు అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ రాజధాని ఉంది. కనుక ఆ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తూనే ఉంటాయి.
హైదరాబాద్ గ్లోబల్ సదస్సులో తెలంగాణకు రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం వాటన్నిటినీ గ్రౌండింగ్ చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇక తిరుగు ఉండదు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. అమరావతి రాజధానిగా చెప్పుకుంటున్నప్పటికీ నేటికీ రాజధానికి రూపురేఖలు ఏర్పడలేదు. పైగా ‘రప్పా రప్పా భయాలు’ ఉండనే ఉన్నాయి.
కనుక పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అదృష్టం కొద్దీ సిఎం చంద్రబాబు నాయుడుకి పరిశ్రమలు, పెట్టుబడులను ముఖ్యంగా.. ఐటి కంపెనీలమి ప్రోత్సహిస్తారనే మంచి పేరుంది. ఆయనకున్న ఈ మంచి ఇమేజే ఇప్పుడు ఏపీకి శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చు.
ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అమెరికా పర్యటనలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఇంటెల్ ఐటి సీటీవో శేష కృష్ణపుర, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ వంటి ప్రముఖులను కలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయా సంస్థలను, అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థకు చాలా భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి రప్పించుకుంటోంది. దానిని పలువురు విమర్శించినప్పటికీ, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలకు మంచి సంకేతాలు పంపినట్లయ్యింది.
ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆయా కంపెనీల సీఈవోలను కలిసి మాట్లాడిన తర్వాత వాటిని కూడా ఏపీకి రప్పించగలిగితే ఆ తర్వాత మిగిలిన ఐటి కంపెనీలు వాటంతట అవే ఆంధ్రాకు తరలివస్తాయి.
ఆలోగా విశాఖ శివారులో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్దం అవుతుంది. విశాఖ నగరాన్ని మెట్రో సిటీగా మార్చేందుకు ఫ్లై ఓవర్లు, విశాలమైన రోడ్లు, మౌలిక వసతులు కల్పించడం చాలా చాలా అవసరం. ఈ పనులన్నీ సమాంతరంగా జరిగితేనే విశాఖ ఐటి రాజధానిగా అవతరించగలదు.






