ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్వయంగా ఏపీ రాజధాని అమరావతికి వస్తే అది అంతర్జాతీయ వార్త. ఆయన పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా ఐటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? అయన ఎందుకు అక్కడికి వెళ్ళారని తెలుసుకునేందుకు తప్పక ప్రయత్నిస్తాయి.
బిల్ గేట్స్ అమరావతికి వెళ్ళి ఏపీలో ఏదో చేయబోతున్నారు కనుక మనం కూడా వెళ్ళాలని ప్రఖ్యాత ఐటి కంపెనీలు భావించడం సహజం. కనుక అయన అమరావతి పర్యటనతో ఏపీలో ఏం పెద్ద మార్పు రాబోతోంది? కొత్తగా ఏయే కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ఐటి కంపెనీలు, ప్రజలు, ఐటి నిపుణులు ఆలోచిస్తున్నారు.
కానీ వైసీపీ మాత్రం ఆయన పర్యటనలో టీలు, సమోసాలకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చెప్పాలని అడిగి నవ్వులపాలయింది. వైసీపీ మేధావులు ఇంతకు మించి ఎక్కువ దూరం ఆలోచించలేరని సోషల్ మీడియాలో కొందరు ఎద్దేవా చేశారు. వైసీపీ హయంలో ఇలా టీ, కాఫీలు, సమోసాల పేరుతో కోట్లు రూపాయలు తినేశారు కనుక వాళ్లకి ఇలాంటి అనుమానం కలగడం సహజమని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.
అప్పుడు గానీ బిల్ గేట్స్ పర్యటన గురించి మాట్లాడాల్సిన తాము ఆయన టీ, సమోసా ఖర్చుల గురించి మాట్లాడు నవ్వులపాలయ్యామని వైసీపీ గ్రహించలేదు.
బుధవారం శాసనసభ ఆవరణలో టీడీపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు తదితరులకు వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎదురైనప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించి సరదాగా ఇదేవిషయం అడిగితే, “మీకో నమస్కారం” అంటూ దణ్ణం పెట్టి వెళ్ళిపోయారు.
ప్రస్తుతం శాసనసభలో బడ్జెట్పై చర్చ జరుగుతోంది. దానిపై మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన కాకి లెక్కలు, ఊహాజనిత అభివృద్ధి అంటూ విమర్శలు గుప్పించి తన పని అయిపోయినట్లు చేతులు దులుపుకున్నారు. ఆయన విమర్శలను వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో వేసుకొని ‘మమ’ అనిపించేశాయి. కానీ నేటికీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతునే ఉన్నాయి.
కనుక ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్లో మీడియా సమావేశం పెట్టి కల్తీ నెయ్యి, హెరిటేజ్ గురిచి ఒక పాట పాడుతారు. అలాగే బడ్జెట్ గురించి నాలుగు ముక్కలు మాట్లాడి, తన హయంలో అమలుచేసిన సంక్షేమ పధకాల గురించి మరో పాట పాడుతారు. ఈ రెండు పాటలతో ‘బిల్ గేట్స్-టీ, సమోసాల ఖర్చులు’ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ అవుతారనే ఆశిద్దాం.




