ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న ఈ క్రమంలో నాటి హైద్రాబాద్ పర్యటన జ్ఞాపకాలు మరోసారి చర్చకొస్తున్నాయి.
అయితే నాడు ఇదే బాబు – బిల్ గేట్స్ కలయిక హైద్రాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి పునాదులు వేస్తే, నేడు ఈ ఇద్దరి కలయిక అమరావతి పురోగతికి తోడ్పాటునివ్వనుంది అనే చర్చ నడుస్తుంది.
నాడు 2020 విజన్ తో హైటెక్ సిటీ తో హైద్రాబాద్ లో వేసిన పునాదులు నేడు మహా వృక్షాలుగా మారి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అవసరమైన ఫలాలను అందిస్తున్నాయి. అదేవిధంగా నేడు 2047 విజన్ తో అమరావతిలో వేస్తున్న ఈ అడుగులు ఏపీ భావితరానికి అభివృద్ధి ఫలాలను అందించనున్నాయి.
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్న అమరావతి, ఎన్నో నిందలు మోసిన అమరావతి నేడు బిల్ గేట్స్ రాకతో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. అమరావతిలో సచివాలయం చేరుకున్న బిల్ గేట్స్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు.
అటుపిదప సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్సించిన గేట్స్, ఆర్జీఎస్ విధానాలు, అవి సాధిస్తున్న ఫలితాలను తెలుసుకున్నారు. ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రోజెక్టులు మెడ్ టెక్,డయాగ్నోస్టిక్స్, సంజీవని పై బాబు గేట్స్ కి ప్రజంటేషన్ ఇచ్చారు.
అలాగే డేటాలేక్, అవేర్ 2.0, వాట్స్ అప్ గవర్నెన్స్, రాజధాని అమరావతి ప్రోజెక్టుల గురించి కూడా బాబు, గేట్స్ కు వివరించారు. ఇటు రాజకీయ పరంగాను టీడీపీ పార్టీ చరిత్రలో ఇదొక మెయిలు రాయి అనే చెప్పాలి. జగన్ మూడు ముక్కలాటతో చిన్నాభిన్నమైన అమరావతి లోకి బాబు ఇలా ప్రముఖుల పర్యటనలను ఆహ్వానించడం, వారితో పర్యటనలు సాగించడం ద్వారా ఆ ప్రాంతం పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది.
ఇప్పటికే అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో టెక్ హబ్ గా మారబోతున్న ఈ తరుణంలో బిల్ గేట్స్ పర్యటన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి చాల కీలకం కానుంది. మరి రానున్న రోజులలో వీటి తాలూకా అభివృద్ధి ఫలాలు ఎటువంటి రాజకీయ చదరంగంలో చిక్కకుండా ఏపీ యువతకు లభించాలని ఆశిద్దాం..!






