కూటమి ప్రభుత్వంలో బిజేపి భాగస్వామిగా ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వంతో చెడుగుడు ఆడుతున్న వైసీపీని ఎదుర్కోవడంలో పెద్దగా ఆసక్తి చూపదు. ఉదాహరణకు తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్రంలో ఇంత గొడవ జరుగుతున్నా బిజేపి మొక్కుబడిగా స్పందిస్తోంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని రెండు తెలుగు రాష్ట్రాలతో సహా యావత్ దేశంలో, ప్రపంచంలో హిందువులు ఆరాధిస్తుంటారు. దేశ విదేశాలలో ఉన్నవారు సైతం స్వామివారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు.
కోట్లాదిమంది హిందువులు ఆరాధించే తిరుమల స్వామివారి పట్ల వైసీపీ ఇన్ని ఘోర అపచారాలు చేసినప్పుడే బిజేపి గట్టిగా నిలదీసి ఉండాలి. కానీ పట్టించుకోలేదు!
స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి అవినీతికి, మహాపచారానికి పాల్పడినందుకు, ప్రజల ముందు తల దించుకొని దోషిగా నిలబడాల్సిన వైసీపీ, తమ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నా ఏపీ బిజేపి నేతలు పెద్దగా స్పందించడం లేదు!
అన్యమతస్తుడైన జగన్ తిరుమలతో ఆటలాడుతుంటే, ఆ పేరుతో రాజకీయ సంక్షోభం సృష్టిస్తుంటే బిజేపి మౌన ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతోంది. ఎందువల్ల?
ఏపీలో కూడా మత రాజకీయాలు ముదిరితేనే బిజేపికి పట్టు లభిస్తుందనే ఆలోచనతోనా? ఆ వ్యూహంలో భాగంగానే జగన్ని పావుగా వాడుకుంటోందా?అందుకే జగన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తోందా?
బిజేపి అధిష్టానం ఏ కారణంతో తన పట్ల మెతకగా వ్యవహరిస్తున్నప్పటికీ అది తనకు అండగా ఉందనే ధైర్యంతో జగన్ ఇంతగా రెచ్చిపోతున్నారా?
బిజేపి అధిష్టానం సూచన మేరకే రాష్ట్ర బిజేపి నేతలు కూడా వైసీపీ విషయంలో ఎంతగా రెచ్చిపోతున్నా మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతున్నారా?వంటి అనేక ప్రశ్నలు ఆంధ్రా ప్రజల మనసులలో సుడులు తిరుగుతున్నాయి.
కనుక కేంద్రం రాష్ట్రాభివృద్ధికి ఎంతగా సహకరిస్తున్నప్పటికీ, వైసీపీ విషయంలో బిజేపి అధిష్టానం ద్వంద వైఖరి, ఆ పార్టీ విశ్వసనీయతని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది.
అమరావతి, తిరుమల, పరిశ్రమలు, పెట్టుబడులు, మెడికల్ కాలేజీల వరకు ప్రతీ దానికీ అడ్డుపడుతూ, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజల మద్య కులం, మతం చిచ్చు రగిలిస్తుంటే బిజేపి అధిష్టానం స్పందించకపోతే వారి మనసులో మరేవో పెద్ద ఆలోచనలు ఉన్నట్లే అనుమానించాల్సి ఉంటుంది.
నేడు టీడీపి, జనసేన, బిజేపి మూడు పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఇవన్నీ చర్చించకపోవచ్చు. కానీ వారి చర్చల సారాంశం మాత్రం ఇదే కావచ్చు.






