శాసనసభ, లోక్సభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా తట్టుకొని నిలబడి పోరాడుతూ రెండో స్థానం కాపాడుకుంటోంది. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరో ఎదురు దెబ్బ తగిలింది.
వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్లపై నేడు జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించి విచారణ జరిపారని, వారిలో ఎవరూ పార్టీ మారలేదని ధ్రువీకరించుకున్నారని సుప్రీంకోర్టుకి తెలియజేశారు.
జస్టిస్ సంజయ్ కరోల్ ఆయన వాదనలతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడితో ఈ కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించారు.
మొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా పార్టీ మారలేదంటూ క్లీన్ చిట్ ఇస్తే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనపై విరుచుకు పడ్డారు.
కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు భావించడంలేదంటూ కేసు మూసివేసింది. కనుక ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని తలుపులు మూసుకుపోయినట్లే. మన న్యాయ వ్యవస్థని గౌరవిస్తానని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది కనుక సుప్రీం తీర్పుని ఆక్షేపించలేదు. అలాగని సమర్ధించలేదు.
ఈ కేసులో కనీసం దానం నాగేందర్, కడియం శ్రీహరి తప్పక రాజీనామాలు చేయాల్సి వస్తుందని, చేస్తే ఉప ఎన్నికలొస్తాయని, వస్తే ఆ రెండు సీట్లు మళ్ళీ గెలుచుకుంటామని కేసీఆర్తో సహా అందరూ ఆశపడ్డారు. కానీ ఈ చిన్న ఆశ కూడా తీరలేదు!
ఎన్నికలలో ఎలాగూ కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూనే ఉంది. చివరికి కోర్టు కేసుల్లో కూడా ఓడిపోవడం జీర్ణించుకోవడం కొంచెం కష్టమే.
గతంలో తాము ఇలాగే కాంగ్రెస్, టీడీపి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించుకున్నప్పుడు, కేసీఆర్ దానిని చాలా గొప్ప విషయమన్నట్లు చెప్పుకున్నారు తప్ప ప్రజాస్వామ్య విరుద్దమనుకోలేదు. అప్పుడూ ఇలాగే కాంగ్రెస్, టీడీపిలో అనర్హత వేటు కోసం పోరాడుతుంటే వాటిని అపహాస్యం చేస్తూ ఇలాగే డీల్ చేశారు తప్ప ఎవరిపై వేటు వేయలేదు.
తాము చేసింది తప్పు కాదు గొప్పని భావించినప్పుడు, అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తే గొప్ప కాదు తప్పంటే ఎలా? ఇది కాంగ్రెస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు. మౌనంగా స్వీకరించక తప్పదు.




