సాధారణంగా రాజకీయ నాయకులు నిలకడగా ఒక రాజకీయ పార్టీలో నిలవరు, తొండ రంగులు మార్చినట్టుగా రాజకీయ నాయకులు పార్టీ జెండాలు, కండువాలు మారుస్తారు అనేది ఒక రాజకీయ నానుడి.
అయితే ఇక్కడ బిఆర్ఎస్ కీలక నేతలు మాత్రం కండువాలు కాదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పై చేసే విమర్శలను మారుస్తున్నారు. రేవంత్ ను ఒక్కో రోజు ఒక్కో పార్టీ తో ముడిపెట్టి నిలకడ లేని విమర్శలు చేస్తున్నారు బిఆర్ఎస్ కీలక నేతలు.
రేవంత్ ను రాజకీయంగా టార్గెట్ చేసే విధానంలో భాగంగా తమకు అవసరమైనప్పుడు ఆ అవసరానికి తగ్గట్టుగా కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్ ని ఓసారి టీడీపీ తో ముడిపెట్టి బాబు మనిషి అంటూ ఏపీ – తెలంగాణ మధ్య ప్రాంతీయవాదాన్ని రెచ్చకొడుతున్నారు.
ఇక మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ ని బీజేపీ తో అంటగట్టి మోడీకి దోస్తీగా చిత్రీకరిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేతను అటు టీడీపీ తో ఇటు బీజేపీ తో ముడిపెట్టి బిఆర్ఎస్ చేస్తున్న విమర్శలలో చిత్తశుద్ధి కరువడుతుంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇక్కడ అభివృద్ధి పనుల కోసం, అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ బీజేపీ పెద్దలను కలుస్తున్నారు, కలవాలి కూడా.
అలాగే కేంద్ర బీజేపీ నాయకులు తెలంగాణ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా ప్రోకల్ ప్రకారం వారికీ ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు, పలకాలి కూడా. అలాగే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గతంలో టీడీపీ చరిత్ర ఉన్న నేతగా రేవంత్ బాబు కి ఆ గౌరవం ఇస్తున్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన గాయాల పరిష్కారానికి ఇరువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాటిని కూడా బిఆర్ఎస్ రాజకీయం చేస్తూ రేవంత్ ని దెబ్బకొట్టాలని భావిస్తే అది బిఆర్ఎస్ కే చేటు.
తాజాగా మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ ను ఆహ్వానిస్తున్నాం అంటూ రేవంత్ చేసిన ప్రకటనతో మీడియా ముందుకొచ్చిన హరీష్ ఈ ప్రక్షాళన పేరుతో రేవంత్ చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు బీజేపీ కేంద్ర మంత్రులు ఎలా వస్తారు.? అసలు బీజేపీ రేవంత్ వైపా.? ప్రజలు వైపా.?
రేవంత్ కూడా పలుమార్లు బీజేపీ నేతలతో సమావేశాలు జరుపుకుని అక్కడి నేతలకు అవసరమైన విధంగా ఇక్కడ పాలన చేస్తున్నారు అంటూ పలు సందర్భాలలో బీజేపీ – రేవంత్ ల మధ్య సంబంధం ఉందంటూ విమర్శలు చేసారు. ఇక కేటీఆర్ కూడా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ – రేవంత్ జిగిడి దోస్తులంటూ ఆరోపణలు చేసారు.
ఇలా బిఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఒకసారి టీడీపీ మనిషి అంటూ మరోసారి బీజేపీ దోస్తీ అంటూ ఇంకోసారి రాహుల్ చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు చేస్తూ తమ పార్టీ విమర్శలకు తమ పార్టీ నేతల ఆరోపణలకు ఒక నిలకడ లేదు అని నిరూపించుకుంటున్నారు.




