రాములమ్మ నుంచి కవిత వరకు… ఒకటే లెక్క?

Kalvakuntla Kavitha Politics

రాజకీయాల్లో చాలా మంది మహిళలున్నారు. కానీ వారిలో అగ్రస్థాయికి ఎంతమంది చేరుకోగలిగారు? అంటే చెప్పడం కష్టం. రాజకీయాల్లో కూడా పురుషాధిపత్యం కొనసాగుతుండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

విజయశాంతి, వైఎస్ షర్మిల, విజయమ్మ వంటివారందరూ మంచి ప్రజాదరణ, రాజకీయాలపై మంచి పట్టు, పోరాట పటిమ ఉన్నవారే. వారిని పార్టీకి అవసరమైనప్పుడు లేదా ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ తర్వాత విధానపరమైన నిర్ణయాలు, పదవుల పంపకాలలో వారిని పక్కన పెట్టేస్తుంటారు.

ADVERTISEMENT

రాజకీయాలను పురుషులు శాశిస్తుండటం వలననే మహిళలు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోలేకపోతున్నారు.

తెలంగాణలో కొండా సురేఖ మంత్రి పదవి పొందినప్పటికీ, ఆమె తన శాఖకు సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని చెప్పుకోవడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.

కనుక రాజకీయాల్లో పురుషులతో సమానంగా మహిళలు కష్టపడినప్పటికీ, సామర్థ్యం నిరూపించుకున్నప్పటికీ, ఈ పురుషాధిపత్యం కారణంగా చివరికి వారు తమ స్థాయి కంటే తక్కువ గుర్తింపుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే, ముందున్న దారి మరింత కఠినంగా కనిపిస్తోంది.

దాదాపు 20 ఏళ్ళుగా ఆమె రాజకీయాలలో ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏబీసీడీలతో ఆమె రాజకీయాలు మొదలుపెట్టాల్సి వచ్చింది.

కొత్త పార్టీ ఏర్పాటు, ప్రజల నమ్మకం పొందడం, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలిచి అధికారంలోకి రావడం.. ప్రతీది చాలా కష్టమే. ఇవి కాక ఆమె లక్ష్యానికి రాజకీయ సమీకరణలు, బలాబలాలు, ఆర్థిక బలం కూడా చాలా కీలకం.

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తాను రాజకీయాల్లో కొనసాగుతానని, ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ ఉందని కవిత బహిరంగంగా చెబుతున్నారు. ఆమెకు ఇంత స్పష్టత ఉండటం చాలా అవసరమే. తనపై తనకు నమ్మకం ఉంటేనే ఇతరులకు కూడా ఆమెపై నమ్మకం కలుగుతుంది.

కానీ రాజకీయాల్లో మహిళలు రాణించలేకపోతున్నాయని చరిత్ర చెబుతోంది. కనుక నమ్మకం, లక్ష్యం ఉంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు దారిలో ఉన్న ఇటువంటి సవాళ్లు, అవరోధాలను కూడా కల్వకుంట్ల కవిత ఎదుర్కొని అధిగమించాల్సి ఉంటుంది.

మరి కవిత వాటిని దాటగలరా? తన లక్ష్యం సాధించగలరా? లేకపోతే, ఆమె కూడా విజయశాంతి, షర్మిల వంటి మహిళా నాయకుల జాబితాలో చేరిపోతారా? కాలమే చెపుతుంది.

ADVERTISEMENT
Latest Stories