వర్క్ ఫ్రం హోం… మంచి ఆలోచనే!

Chandrababu Naidu Plans Big Moves Amid Oil Crisis in India

అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం క్రమంగా పెరుగుతోంది.

కనుక పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చి, తక్షణమే తన కాన్వాయ్‌లో వాహనాలను సగానికి తగ్గించుకున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌తో సహా మంత్రులందరూ తమ కార్ల కాన్వాయ్ సగానికి తగ్గించుకున్నారు. ఒకటి రెండు రోజులలో మరిన్ని పొదుపు చర్యలు ప్రకటిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు నిన్ననే చెప్పారు.

ADVERTISEMENT

‘సమస్యలు, సంక్షోభం నుంచి కూడా అవకాశాలు సృష్టించుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు తరచూ చెపుతుంటారు. ఆయన ఈ విధానాన్ని తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో, ప్రభుత్వపరంగా పాలనలో కూడా ఆమలు చేసి విజయాలు సాధిస్తుంటారు.

ఇప్పుడు చమురు సంక్షోభంలో మళ్ళీ అటువంటి అవకాశాల కోసం సిఎం చంద్రబాబు నాయుడు వెతుకుతున్నారు. విదేశాలకు విహార యాత్రలు మానుకోవాలని ప్రధాని మోడీ పిలుపులో ఆ అవకాశాన్ని చూశారు. రాష్ట్రంలోని అరకు, సూర్యలంక తదితర పర్యాటక ఆకర్షక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో విహారయాత్రలు చేసేందుకు వీలు కల్పిస్తూనే, ప్రభుత్వానికి పర్యాటకం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించారు.

కోవిడ్ సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారాయి. కానీ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత చమురు సంక్షోభం కారణంగా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఐటి కంపెనీలకు ఇదేమీ కొత్త కాదు. గతంలో కోవిడ్ సమయంలో మంత్రులు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు కూడా ఈవిధంగా పనిచేశారు. కనుక ఈసారి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కూడా మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారే అవకాశం ఉంది. త్వరలోనే వర్క్ ఫ్రం హోమ్ విధానం విధివిధానాలు ప్రకటిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఇలాంటి పలు చర్యలతోనే గతంలో కరోనా సంక్షోభం నుంచి భారత్‌ గట్టెక్కింది. కనుక ఈసారి చమురు సంక్షోభం నుంచి కూడా గట్టెక్కుతుంది.

ADVERTISEMENT
Latest Stories