జగన్‌ రప్పారప్పాలని ప్రోత్సహిస్తుంటే లోకేష్‌…

Chandrababu Naidu vs Jagan: Why Lokesh Stands Apart in Politics

సిఎం చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు కాస్త గొప్పలు చెప్పుకుంటారు. రాజకీయాలలో నాలుగు దశాబ్దాలు ఉన్నారు కనుక అది సహజం. కానీ ఆయన ఏనాడూ బహిరంగంగా ఇతరులను చులకన చేసి మాట్లాడరు.

తన గురించి నిత్యం చులకనగా మాట్లాడే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, జగన్‌ వంటి వారి గురించి కూడా ఎన్నడూ అనుచితంగా ఒక్క మాట మాట్లాడరు. కనీసం వారి మాటలకు స్పందించరు! మంత్రులు, ఎమ్మెల్యే, పార్టీలో నేతలు ఎవరినీ అనుమతించరు కూడా!

ADVERTISEMENT

ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తుంటారు. పదవిలో లేనప్పుడు, ఉన్నప్పుడూ కూడా సాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో సీనియర్ నేతల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తుంటారు. సామాన్య ప్రజల పట్ల ముఖ్యంగా వయసులో పెద్దవారైన ప్రజల పట్ల మరింత వినయంగా వ్యవహరిస్తుంటారు.

జగన్‌, కేటీఆర్‌ ఇద్దరి మాటలలో కనబడే పొగరు, అహంకారం మంత్రి నారా లోకేష్‌ మాటలలో అసలు కనబడవు. “కానీ నేను మా తండ్రి చంద్రబాబు నాయుడులా సాత్వికుడిని కాను. అవసరమైనప్పుడు ప్రత్యర్ధులకు ధీటుగానే జవాబు చెప్తాను,” అంటారు. అలాగే జవాబు చెప్తుంటారు కూడా. కానీ ఆ మాటలలో కూడా ‘టీమ్‌ 11’ వంటి వ్యంగ్యం పాళ్ళే ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ చురకలను కూడా అందరూ ఆస్వాదిస్తుంటారు.

ఓ గీతని చెరపకుండా చిన్న గీత చేయాలంటే పక్కనే పెద్ద గీత గీస్తే చాలు. కానీ పెద్ద గీతని మళ్ళీ గీయకుండా ఇంకా పెద్దది చేయాలన్నా కూడా పక్కనే చిన్న గీత గీస్తే చాలు.

అదేవిధంగా నారా లోకేష్‌ గురించి చెప్పుకోవాలంటే జగన్‌ గురించి తప్పక చెప్పుకోవాలి.

పార్టీలో బూతులు మాట్లాడే నేతలని, రప్పా రప్పా తలకాయలు నరికేస్తామని బెదిరించే కార్యకర్తలని జగన్‌ ప్రోత్సహిస్తుంటారు. కానీ మంత్రి నారా లోకేష్‌ తీరు ఇందుకు పూర్తి భిన్నం.

నిన్న కాకినాడ జేఎన్టీయూలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన ఈ మాటలు వింటే జగన్‌కి, లోకేష్‌కి తేడా మరింత స్పష్టంగా అర్ధమవుతుంది.

“మనం బాగా ఉన్నప్పుడు అందరూ మనల్ని పలకరిస్తారు. కానీ కష్టకాలంలో ఒక్కరూ మనకు తోడుగా నిలవరు. మా తండ్రి చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు, మొట్ట మొదట వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్‌గారే. ఆరోజు అయన నాకు, మా తండ్రిగారితో మాట్లాడిన మాటలు, ఇచ్చిన ధైర్యం ఎన్నటికీ మరిచిపోలేను. అందుకు జీవితాంతం ఆయన కృతజ్ఞతగా ఉంటాను.

మీరందరూ విద్యార్ధులు.. 20 ఏళ్ళ వయసులో ఉన్నారు. ఎవరూ ఇంకా జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని ఉండకపోవచ్చు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడినవారిని ఎన్నడూ మరిచిపోవద్దు,” అని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.

ఈ చిన్న ఉదాహరణ జగన్‌, మంత్రి నారా లోకేష్‌ మాట తీరు, ఆలోచనా ధోరణి, వైఖరిలో ఎంత తేడా ఉందో పట్టి ఇస్తోంది కదా?

ADVERTISEMENT
Latest Stories