ఐటి సదస్సులు, సమావేశాలు ఎక్కడ జరిగినా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా హాజరవుతుంటారు. ఆయనతో పాటే మంత్రి నారా లోకేష్ కూడా.
దీనినే మరోవిధంగా చెప్పుకుంటే దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఐటి సదస్సులు జరిగినా సిఎం చంద్రబాబు నాయుడుకి తప్పకుండా ఆహ్వానం వస్తుంది. అంటే అర్థం ఏమిటి?
అయనకు ఐటి రంగంపై ఆసక్తి ఉండటం, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహనా పెంచుకొని దానిని తన ప్రభుత్వంలో వినియోగించుకోవాలనుకోవడం, ఐటి కంపెనీలు, ఐటి రంగాన్ని ప్రోత్సహించడంలో సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందే ఉండటమే దీనికి కారణం.
అయితే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా ఇలాంటి సదస్సులలో పాల్గొంటారు. ఎందువల్ల? అంటే ఆయన ఆసక్తులు, అభిరుచులు, ప్రాధాన్యతలు వేరు కనుకనే.
కానీ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని మారుమూల గ్రామాలకు రోడ్లు, లైట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గిరిజనుల అభిమానం పొందుతున్నారు. అలాగే అటవీ, పర్యావరణ మంత్రిగా వాటి పరిరక్షణపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
పవన్ కళ్యాణ్కి దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, గోసంరక్షణ పట్ల ఆసక్తి ఎక్కువే కనుక సనాతన ధర్మ పరిరక్షణ వైపు అడుగులు వేస్తుంటారు. అయితే వాటితో బిజేపిని, రాజకీయాలను మిళితం చేస్తుండటంతో ఈ విషయంలో ప్రజలలో అనుమానాలు, అపోహలు నెలకొన్నాయి.
ముఖ్యంగా తిరుమలలో జరిగిన అపచారాలపై పవన్ కళ్యాణ్, జనసేన స్పందన చాలా పేలవంగా ఉంది. అలాగే కల్తీ నెయ్యి వివాదంలో తప్పు చేసి దొరికిపోయిన వైసీపీ తిరిగి తమ ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్, జనసేన స్పందన పేలవంగానే ఉంది.
బహుశః ఈ వ్యవహారాన్ని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తనదైన శైలిలో హ్యాండిల్ చేస్తున్నందున, ఆయన సూచన మేరకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారేమో?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ ఇద్దరి తీరుని బేరీజు వేసి చూసినట్లయితే, సిఎం చంద్రబాబు నాయుడు ‘ఆల్ రౌండర్’ అనిపిస్తే, పవన్ కళ్యాణ్ మంచి ‘వికెట్ కీపర్’ అనిపిస్తారు.
పవన్ కళ్యాణ్కి కాస్త సమయం, ఓపిక, సహనం మూడూ ఉన్నాయి. కనుక తాపీగా సాగుతుంటే, సిఎం చంద్రబాబు నాయుడుకి 2029 ఎన్నికల డెడ్ లైన్ ఉంది కనుక రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. అంతే తేడా!




