సోమవారం మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజీలో ఒక్కసారిగా 11.43 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో గేట్లన్నీ ఎత్తి విడుదల చేయక తప్పలేదు. ఇంచుమించు అదే సమయంలో బుడమేరు పొంగి ప్రవహించడంతో విజయవాడ, పరిసర ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెపుతో అవసరమైన సహాయసహకారాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు అందరూ సహాయ చర్యలని పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ, పరిసర ప్రాంతాలలోని లక్షల మందికి ఆహారం, మంచినీళ్ళు, కూరగాయలు వగైరా అందిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, సహాయ బృందాలను విజయవాడ తప్పించి సహాయ చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలని ముందే సురక్షిత ప్రదేశాలకు తరలించడం వలన ప్రాణ నష్టం తప్పింది.
స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాలలో బాధితులను కలిసి ధైర్యం చెప్పి అవసరమైన సహాయ చర్యలు చేపడుతుంటే, చంద్రబాబు నాయుడు ‘ఫోటో షూట్’ హడావుడి మొదలైందని, ప్రచారం కోసమే తిరుగుతున్నారని సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారం చేస్తోంది.
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఓ ముఖ్యమంత్రి ఇంత బాధ్యతగా వ్యవహరిస్తుంటే దానినీ వైసీపి తప్పు పట్టడం దాని నీచ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు బయటకు రాకపోయిన వైసీపి విమర్శించకుండా ఉండదు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వస్తే వారం రోజుల తర్వాత తాపీగా వెళ్ళి మొక్కుబడిగా బాధితులని పరామర్శించారు. అప్పుడూ… చంద్రబాబు నాయుడు వెళ్ళి వారిని పరామర్శిస్తున్నారనే బయటకు వచ్చారు తప్ప లేకుంటే తాడేపల్లి ప్యాలస్లో నుంచి బహుశః బయటకు వచ్చేవారే కారేమో?
ఇప్పుడు కూడా జగన్ లండన్ బయలుదేరేందుకు అన్ని ఏర్పట్లుచేసుకొని, సిఎం చంద్రబాబు నాయుడుని చూసి నిన్న హడావుడిగా ముంపు ప్రాంతాలలో పర్యటించి విమర్శలు గుప్పించారు.
సుమారు శతాబ్దం క్రితం కృష్ణానదిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చిందని, మళ్ళీ తన హయాంలో కూడా ఆ స్థాయిలో వరద ప్రమాదం పొంచి ఉందని తెలియగానే ప్రకాశం, శ్రీశైలం వగైరా డ్యామ్ల నుంచి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీటిని దిగువకు వదులుతూ నగరం నీట మునగకుండా కాపాడమన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలననే విజయవాడ నగరం నీట మునిగిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు.
డ్యామ్లలో నీటిని ఎప్పుడు ఎంతవరకు నిలువ చేయవచ్చో సంబంధిత అధికారులు లెక్కచూసుకొని దిగువకు విడుదలచేస్తారు తప్ప ముఖ్యమంత్రి చెప్పారని చేయరు. ఇన్ఫ్లో ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు గేట్లు మూసేసి నీటిని కొద్దికొద్దిగా విడుదల చేస్తే మొత్తం డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్కు ఇంత చిన్న విషయం తెలియకపోవడం గమనిస్తే ఆయనకు ఎంత విషయం అవగాహన ఉందో అర్దం చేసుకోవచ్చు.
జగన్ అధికారం కోల్పోగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ కొన్నిరోజులు రాజకీయాలు చేశారు. ఆ తర్వాత శవ రాజకీయాలు చేశారు. ఇప్పుడు వరద రాజకీయాలు చేస్తున్నారు.
అచ్యుతాపురంలో శవరాజకీయాలు చేసి మొసలి కన్నీళ్ళు కార్చిన జగన్ మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడనే లేదు. ఎందుకంటే అది అక్కడితో సరి. ఇప్పుడూ ఇంతే!
వైసీపి దాని అధినేత జగన్ తీరు చూస్తే, ప్రజలు గడ్డిపెట్టినా వీళ్ళు ఎప్పటికీ మారారా? అనే సందేహం కలుగుతుంది.




