సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 1999, జనవరిలో మొట్ట మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ‘రైతు బజార్లు’ ఏర్పాటు చేయించారు. వాటితో అటు రైతులకు, ఇటు ప్రజలకు చాలా మేలు కలుగుతుండటంతో వాటికి మంచి ప్రజాధరణ లభించింది. కనుక క్రమంగా వాటి సంఖ్య, రైతు బజార్లలో సౌకర్యాలు, ఉత్పత్తులు అన్నీ పెరిగాయి.
ప్రతీ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించే కేసీఆర్, కేటీఆర్, జగన్ కూడా వీటి విషయంలో విమర్శించకపోవడం గమనిస్తే ఇది ఎంత మంచి ఆలోచనో అర్ధమవుతోంది.
నాడు రైతు బజార్లను ప్రవేశపెట్టిన సిఎం చంద్రబాబు నాయుడు హయంలోనే ఇప్పుడు కొత్తగా ‘డిజి రైతు బజార్’ మొబైల్ యాప్ని ప్రవేశపెట్టడం చాలా అభినందనీయం.
రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలుచేసి చూడగా విజయవంతమైంది. కనుక క్రమంగా అన్ని జిల్లాలలో రైతు బజార్లకు దీనిని విస్తరిస్తున్నారు.
ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు రైతు బజార్లే నేరుగా తాజా కూరగాయలు, ఆకు కూరలు, పళ్ళు వగైరాలను డోర్ డెలివరీ చేసేలా ఈ వ్యవస్థని ఏర్పాటు చేశారు.
ముందుగా మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటరులో డిజి యాప్ లేదా వెబ్సైట్ డౌన్ లోడ్ చేసుకొని మీ వివరాలు నమోదు చేసుకోవాలి. లాగిన్ అయ్యి ఆన్లైన్లో అవసరమైన కూరగాయలు, ఆకో కూరలు, పళ్ళు.. వాటి ధరలను చూసుకొని ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చేస్తాయి. అది కూడా రైతు బజారు ధరలకే! డెలివరీ ఛార్జీలు కేజీకి, కి.మీకు రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
నగరాలు, పట్టణాలలో రైతు బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే తక్కువలో తక్కువ రూ.50 ఖర్చవుతుంది. అదే ఖర్చుతో ఇంటికే కూరగాయలు తెచ్చుకోవడం సులువు కదా? ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కనుక దీనిని ప్రయత్నించవచ్చు. కూరగాయల నాణ్యత, తాజాదనం, బరువు, ధర, డెలివరీ విషయంలో ఏమైనా తేడా ఉన్నట్లయితే పిర్యాదు చేయవచ్చు.




