
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత చాలా నీరసించిపోయినప్పటికీ, కేవలం 15 నెలల్లోనే మళ్ళీ పూర్తిగా పుంజుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. వివిద కారణాల చేత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతుందటమే బిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎత్తిచూపుతూ శాసనసభ లోపల బయటా గట్టిగా నిలదీస్తోంది.
ఈ నేపధ్యంలో కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కదలిక రావడం ఆసక్తికరమైన పరిణామమే. ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు అమెరికా పారిపోయి అక్కడే ఉండిపోయారు. వారిని వెనక్కు రప్పించేందుకు ఇటీవలే సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. కనుక తప్పనిసరిగా తిరిగి రావలసి ఉంటుంది లేదా అమెరికా పోలీసులే అరెస్ట్ చేసి హైదరాబాద్ తిప్పి పంపుతారు.
Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!
ఈ నేపధ్యంలో శ్రవణ్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మద్యంతర బెయిల్ సంపాదించుకున్నారు. అంటే తిరిగి రావాలనుకుంటున్నారన్న మాట!శ్రవణ్ రావు రేపు (శనివారం) విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు (సిట్) ఆయన కుటుంబ సభ్యులకు రెండు రోజుల క్రితమే నోటీస్ అందించారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు పోలీస్ అధికారులు స్పెషల్ ఇంటలిజన్స్ బ్రాంచ్ (సిఐబి) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మాజీ సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని, బిఆర్ఎస్ అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు పోలీసు వాహనాలలో డబ్బు తరలించేవారిమని చెప్పారు.
Also Read – ఒక్క ఫోన్కాల్తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!
ఈ మొత్తం వ్యవహారంలో మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు కీలక పాత్ర పోషించారని పోలీసులు ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇప్పుడు మద్యంతర బెయిల్ లభించింది కనుక ఒకవేళ ఆయన అమెరికా నుంచి రేపు హైదరాబాద్ వచ్చి విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అవన్నీ కేసీఆర్ మెడకు ఉచ్చులా బిగుసుకోవడం ఖాయమే. ఒకవేళ అదే జరిగితే, తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ వేడి పెరుగుతుంది. ఇపుడిప్పుడే మళ్ళీ కోలుకుంటున్న బిఆర్ఎస్ పార్టీకి అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.