దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ తిరుమల పర్యటన వివాదాస్పదం అవుతుందని అందరూ అనుకున్నదే. అనుకున్నట్లే వారిద్దరూ అక్కడ కాస్త అతిచేసి అందరి దృష్టిని ఆకర్షించడం, అందుకు తిరుపతి వన్ టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
వారిరువురూ తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకోకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అదేదో గొప్ప విషయమన్నట్లు ప్రచారం చేసుకున్నారు కూడా. పైగా పరమ పవిత్రమైన తిరుమలకి వచ్చి హడావుడి చేసి మరో తప్పు చేశారు.
అంతటితో ఊరుకోకుండా మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతుల గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం మరో తప్పు.
కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు వారిరువురిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్కి తమ పరిస్థితి బాగా అర్దమైంది.
కనుక దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై మేము పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళము. ఒకవేళ ఏమైనా మాట్లాడితే రాజకీయ పరమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడుతాను తప్ప ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనని హామీ ఇస్తున్నాను. కనుక వాళ్ళు (పవన్ కళ్యాణ్ అభిమానులు) కూడా మా జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము… వేడుకొంటున్నాము. దయచేసి ఇక్కడితో ఈ వివాదం ముగిద్దాం,” అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మరి ఈ రాజీ ఒప్పందం జనసైనికులు అంగీకారమేనా? వాళ్ళే చెప్పాలి.




