నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయబోతున్నట్లు టిడిపి ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు, మంత్రులు చాలా ఎగతాళి చేశారు. నారా లోకేష్ని ఓ పప్పు అని, పాదయాత్రతో ఆయనకి కాళ్ళు నొప్పులు తప్ప టిడిపికి ఏ ప్రయోజనం ఉండదని, నాలుగు రోజులు పాదయాత్ర చేసి ఆయనే ఏదో కుంటిసాకుతో మద్యలో ఆపేసి ఇంటికి వెళ్ళిపోతారని వెటకారం చేశారు.
కానీ నారా లోకేష్ 24 రోజులలో 300 కిమీ పాదయాత్ర పూర్తి చేయడంతో షాక్ అవుతున్నారు. పైగా నారా లోకేష్కి సరిగ్గా మాట్లాడటం చేతకాదని వాదించిన వైసీపీ నేతలకి నిత్యం ఆయన వేస్తున్న చురకలు, విసురుతున్న సవాళ్ళు మంటెక్కించేస్తున్నాయి. అయితే పోలీసులని పెట్టి అడ్డుకొనే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగతంగా నారా లోకేష్కి, రాజకీయంగా యువగళం పాదయాత్రకి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నామని చాలా ఆలస్యంగా గ్రహించారు వైసీపీ నేతలు. నాలుగు రోజులకి మించి నారా లోకేష్ పాదయాత్ర చేయలేరని ఎగతాళి చేసి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే నారా లోకేష్ని తక్కువ అంచనా వేశామని అంగీకరించిన్నట్లవుతుంది. ఆయన విజయవంతంగా ముందుకు సాగుతున్నారని కూడా వైసీపీ అంగీకరించిన్నట్లవుతుంది.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తమని, తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డిని చీల్చిచెండాడుతుంటే ఎదురుదాడి చేస్తే ఆయనని గుర్తించి స్వయంగా ప్రమోట్ చేసిన్నట్లవుతుంది. మౌనంగా ఉండిపోతే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళతాయి. వైసీపీ నేతలకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో వారిని ఆదుకొనేందుకు, ఐ-ప్యాక్ రంగంలోకి దిగింది.
గత ఎన్నికలలో నారా లోకేష్ని పప్పు అంటూ బ్రాండింగ్ చేసి దుష్ప్రచారం చేసి ఆయన వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బతీసిన ఐ-ప్యాక్ ఇప్పుడు అదే నారా లోకేష్ని ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తించినట్లే ఉంది. అందుకే నారా లోకేష్తోనే టిడిపిలో చిచ్చు రగిలించాలని ప్రయత్నించాలని వైసీపీ నేతలకి సూచిస్తోంది.
“ఇంతకీ టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధి నారా లోకేషా లేక చంద్రబాబు నాయుడా?ఒకవేళ చంద్రబాబు నాయుడైతే నారా లోకేష్ ఏ లెక్కన ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నారు?టిడిపిలో నారా లోకేష్ పాత్ర ఏమిటి?” అంటూ ప్రశ్నించమని వైసీపీ నేతలకి సూచించిన్నట్లు సమాచారం.
తద్వారా టిడిపి నేతలని రెండుగా చీల్చి చిచ్చు రగిలించాలనేది ఐ-ప్యాక్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే నారా లోకేష్ ఈవిషయం బాగానే గ్రహించారు. అందుకే యువగళం పాదయాత్రలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన సారధ్యంలోనే మేమందరం పనిచేస్తామని విస్పష్టంగా చెపుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఆనాడు పప్పు అంటూ నారా లోకేష్ని ‘బ్రాండింగ్’ చేసి టిడిపిని దారుణంగా దెబ్బ తీసిన అదే ఐ-ప్యాక్ ఇప్పుడు నారా లోకేష్ని ‘ఫైర్ బ్రాండ్’ అని అంగీకరించడం గమనిస్తే ఆనాడు నారా లోకేష్ గురించి చేసింది కేవలం దుష్ప్రచారమే అని అంగీకరించిన్నట్లే కదా?



