వైసీపీ నేతల ఇళ్ళపై ఐ‌టి దాడులు… దేనికి సంకేతం?

Vallbhaneni_Vamsi_నిన్న సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కుశలప్రశ్నలు అడిగారు. ఈరోజు తెల్లవారేసరికి ఐ‌టి అధికారులు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు మొదలుపెట్టారు! ‘అల్లుడు అల్లుడే… పేకాట పేకాటే…’ అన్నట్లు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ సిఎం జగన్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చినంతమాత్రన్న ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులు ఆగవని స్పష్టమైంది.

ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి ఇద్దరి ఇళ్ళలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలలో 20 బృందాలు పాల్గొంటున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న వంశీరామ్ బిల్డర్స్ యజమాని ఇళ్ళు, కార్యాలయాలలో కూడా ఐ‌టి సోదాలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలలో చాలా మందికి ఇసుక, మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్నారు. కనుక లెక్కలలో చూపని ఆదాయం… పన్నుల ఎగవేతలు కూడా భారీగానే ఉంటాయి.

ADVERTISEMENT

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్ర రెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేటికీ అతను ఢిల్లీ తిహార్ జైల్లోనే రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. ఈ కేసులో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇంకా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా కీలకసూత్రధారులని సీబీఐ కోర్టుకి సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ కల్వకుంట్ల కవితని ప్రశ్నించడానికి నోటీస్ పంపింది. కనుక త్వరలోనే మాగుంటకి నోటీస్ రాబోతోందని భావించవచ్చు.

సిఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిలు ఇద్దరూ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో వినయవిధేయంగా మెసులుకొంటున్నప్పటికీ, వైసీపీ నేతల ఇళ్ళు, కార్యాలయాలపై ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి?అనే ఈ ప్రశ్నకు సమాధానం తెలంగాణలో దొరుకుతుంది. అక్కడ బిజెపిని బలోపేతం చేసుకొనేందుకుగాను ఇటువంటి దాడులతో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే, ఇక్కడ ఏపీలో వైసీపీ నేతలను కూడా బిజెపిలోకి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. కనుక వైసీపీకి కౌంట్ డౌన్‌ మొదలైందనే అనుకోవాలేమో?

ADVERTISEMENT
Latest Stories