విశాఖ తీరంలో యుద్ధనౌకలతో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

International Fleet Review with Indian and foreign warships displayed at Visakhapatnam coast

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు కరువు లేదు. వాటిలో విశాఖ బీచ్ ప్రధానమైనది. ఈరోజు సాయంత్రం విశాఖ సముద్రతీరంలో జరుగబోయే ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా సందర్శకులు వస్తున్నారు.

ఈ ఫ్లీట్ రివ్యూలో రష్యా, ఆస్ట్రేలియాతో సహా 71 దేశాల నుంచి వచ్చిన 19 యుద్ధ నౌకలువాటితో బాటు భారత్‌ నావికా దళానికి చెందిన 45 యుద్ధ నౌకలు, విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, నేవీ కోస్ట్ గార్డ్, పరిశోధన నౌకలు నేడు విశాఖ సముద్ర తీరంలో ప్రదర్శనకు వచ్చాయి.

ADVERTISEMENT

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై మిగ్-29 యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్, హెలికాఫ్టర్లతో నావికా దళాల విన్యాసాలు వగైరా చాలా అరుదైన కార్యక్రమాలు నేడు విశాఖ సముద్రతీరంలో జరుగబోతున్నాయి.

ఈ ఫ్లీట్ రివ్యూని సందర్శించేందుకు భారత్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ మంగళవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. వివిధ దేశాల నుంచి విశాఖకు వచ్చిన నేవీ ఛీఫ్‌లకు భారత్‌ త్రివిద దళాల కమాండర్ హోదాలో విందు ఇస్తారు. ఆ తర్వాత ఫ్లీట్ రివ్యూకి అనుమతిస్తారు.

ఈరోజు ఐఎన్ఎస్ సుమేద యుద్ధనౌకలో కాసేపు సముద్ర విహారం చేసిన తర్వాత దేశ విదేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకల సిబ్బంది గౌరవ వందనం స్వీకరిస్తారు.

ఈరోజు జరుగబోయే ఫ్లీట్ రివ్యూలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, పలువురు మంత్రులు పాల్గొంటారు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ కూడా మంగళవారం సాయంత్రమే విశాఖ చేరుకున్నారు.

ఫ్లీట్ రివ్యూలో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇంకా నావికాదళానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు.

సామాన్య ప్రజలకు యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను చూసే అవకాశం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఈ ఫ్లీట్ రివ్యూ పుణ్యమాని గత వారం పది రోజులుగా విశాఖ సముద్రతీరంలో ఒకేసారి అనేక యుద్ధ నౌకలు దర్శనమిస్తున్నాయి.

ప్రతీ రోజూ సాయంత్రం పూట నావికా దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు విన్యాసాలు, నావికా సిబ్బంది చేస్తున్న హడావుడీ అంతా ఇంతా కాదు. వాటిని చూసేందుకు వేలాదిమంది తరలివస్తున్నారు. విశాఖ సముద్రతీరంలో ఓ వైపు లంగరు వేసిన యుద్ధ నౌకలు, ఒడ్డున పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొని ఉంది.

ADVERTISEMENT
Latest Stories